
రెండో వన్డేలో 181 పరుగులకే కుప్పకూలి, వెస్టిండీస్ చేతుల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, మూడో మ్యాచ్లో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా రాణించడంతో... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగుల భారీ స్కోరు చేసింది..
ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ కలిసి తొలి వికెట్కి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెస్టిండీస్లో టీమిండియాకి ఇదు అతి పెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం.. 2017లో అజింకా రహానే, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్కి జోడించిన 132 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసింది శుబ్మన్ గిల్- ఇషాన్ కిషన్ జోడి...
వరుసగా మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్తో 8 పరుగులు చేసి అల్జెరీ జోసఫ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు..
నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సంజూ శాంసన్, శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసిన సంజూ శాంసన్, వన్డేల్లో మూడో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్కి ప్రయత్నించిన సంజూ శాంసన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో హెట్మయర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 92 బంతుల్లో 11 ఫోర్లతో 85 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, సెంచరీకి 15 పరుగుల ముందు పెవిలియన్ చేరాడు..
సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు..
కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, 45 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రొమారియో షెఫర్ట్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్తో 18 పరుగులు రాబట్టిన హార్ధిక్ పాండ్యా, టీమిండియా స్కోరును 350 మార్కు దాటించాడు. హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా రవీంద్ర జడేజా 7 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్కి 19 బంతుల్లో 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు.