
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ను అందరూ ‘గబ్బర్’ అని పిలుస్తారు. ఆట విషయం పక్కనబెడితే ధావన్ స్టైల్.. సెంచరీ చేసిన తర్వాత అతడి సైగలు.. బాలీవుడ్ క్లాసిక్ మూవీ షోలే లోని గబ్బర్ సింగ్ ను గుర్తుకు చేస్తాయి. అయితే తాజాగా శిఖర్ ధావన్.. ఆ సినిమాలో విలన్ చెప్పే ఫేమస్ డైలాగ్.. ‘కిత్నే ఆద్మీ తే...’ (ఎంతమంది ఉన్నారు..?) ను తన స్టైల్ లో ఇమిటేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
గత కొన్నిరోజులుగా జట్టులో చోటు కోల్పోయిన ధావన్.. అభిమానులకు మాత్రం నిత్యం టచ్ లోనే ఉంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా అతడికి సంబంధించిన విషయాలను వారితో పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ లో గబ్బర్ సింగ్ డైలాగ్ ను ఇమిటేట్ చేశాడు... ‘కిత్నే ఆద్మీ తే..’ ను తన స్టైల్ లో అనుకరించాడు. ఆ వీడియోను పోస్టు చేస్తూ.. అదే లైన్ ను క్యాప్షన్ ఇచ్చాడు గబ్బర్..
ఇదిలాఉండగా.. ఈ వీడియో పై ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను వదిలేసి ఆటమీద దృష్టి పెడితే బెటరని సలహాలు ఇస్తున్నారు. పలు యూజర్లు స్పందిస్తూ.. ‘ఇక ఇవే మిగిలున్నాయా ధావన్ భాయ్...’ ‘టీమిండియాకు దూరమయ్యావు.. ఎంటర్టైన్ మీద పడ్డావా....? ఇవి మానేసి ఆటమీద దృష్టి పెడితే బెటర్..’ అని స్పందిస్తున్నారు.
మరికొందరు.. ‘ఇద్దరు ఉన్నారు.. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్.. ’ ‘ముగ్గురున్నారు సార్...’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆటకు దూరమైనా గబ్బర్ మాత్రం రీల్స్, వీడియోస్ తో అభిమానులతో టచ్ లోనే ఉండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ధావన్.. తిరిగి జట్టులోకి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా బరిలోకి దిగాడు. కానీ ఈ టోర్నీలో కూడా గబ్బర్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఐదు మ్యాచులాడిన ధావన్.. వరుసగా 12, 8, 14, 12, 0 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఇక ఈ ప్రదర్శనతో గబ్బర్ కు టీమిండియాలో దారులు మూసుకుపోయినట్టేనని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.
మరోవైపు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, వెంకటేశ్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు దేశవాళీ తో పాటు ఐపీఎల్ లో కూడా రాణిస్తుండటం.. జాతీయ జట్టులో కూడా చోటు కోసం పరుగుల వరద పారిస్తుండటంతో ధావన్ రాకపై నీలనీడలు కమ్ముకున్నాయి.