సాహో శార్దూల్ ఠాకూర్... జో రూట్ అవుట్, ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్...

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2021, 7:58 PM IST
Highlights

36 పరుగులు చేసిన జో రూట్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన శార్దూల్ ఠాకూర్... ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్, విజయానికి మూడు వికెట్ల దూరంలో టీమిండియా...

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 78 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ కావడం జో రూట్‌కి ఇది రెండోసారి. 

182 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఇప్పుడు డ్రా చేసుకోవాలంటే ఇంకా కనీసం 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 77/0 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకి శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లోనే తొలి షాక్ తగిలింది. 

తొలి వికెట్‌కి 100 పరుగులు జోడించిన తర్వాత 50 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు... ఆ తర్వాత డేవిడ్ మలాన్ రనౌట్ అయ్యాడు. 63 పరుగులు చేసిన హసీబ్ హమీద్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు...

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన ఓల్లీ పోప్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... జస్ప్రిత్ బుమ్రాకి టెస్టుల్లో ఇది 100వ వికెట్. 24 మ్యాచుల్లో 100 టెస్టు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, అత్యంత వేగంగాఈ ఫీట్ సాధించిన భారత పేసర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు...

ఇంతకుముందు 1980లో కపిల్‌దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. 41 ఏళ్ల కిందటి కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... తొలి ఇన్నింగ్స్‌లో మొయిన్ ఆలీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసినా, సరిగా అప్పీలు చేయకపోవడంతో ఈ ఫీట్ సాధించేందుకు రెండో ఇన్నింగ్స్ దాకా వేచి చూడాల్సి వచ్చింది...
 
ఓల్లీ పోప్‌ను అవుట్ చేసిన తర్వాతి ఓవర్‌లోనే జానీ బెయిర్‌స్టోని డకౌట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. దీంతో 146 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్... ఆ తర్వాత మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు. జడ్డూ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మొయిన్ ఆలీ.
 

click me!