
పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ పై మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ గొప్ప బ్యాటరే కావొచ్చు గానీ కోహ్లీ, డివిలియర్స్ వంటి దిగ్గజాలతో పోల్చేంత స్థాయి ఆటను ఇంకా బాబర్ ఆడటం లేదని వాపోయాడు. అలా ఆడాలంటే బాబర్ తన స్ట్రైక్ రేట్ పై దృష్టి సారించాలని.. చివరి దాకా మ్యాచ్ లలో నిలిచి వాటిని ఫినిష్ చేయాలని సూచించాడు.
పాకిస్తాన్ లోని ఓ టీవీ ఛానెల్ లో జరిగిన ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ.. ‘నా వ్యాఖ్యలను మరోలా అనుకోవద్దు. బాబర్ ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేయర్. అందులో సందేహమే లేదు. అంతేగాక అతడు పాకిస్తాన్ కు కెప్టెన్. అది మనకు గర్వకారణం...
అయితే అతడు తన ఆటను కొంత మార్చుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. బాబర్ కూడా ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, డివిలియర్స్ వలే ఎదగాలంటే ముందు అతడు తన స్ట్రైక్ రేట్ మీద దృష్టిసారించాలి. మ్యాచ్ లను ఫినిష్ చేసేదాకా క్రీజులో ఉండాలి. ఆ విషయంలో బాబర్ చాలా వెనుకబడి ఉన్నాడు. మ్యాచ్ విన్నర్ కావాలంటే బాబర్ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి...’అని తెలిపాడు.
ఇదే చర్చలో పాల్గొన్న బాబర్ సహచర ఆటగాడు ఇమామ్ మాట్లాడుతూ... ‘బాబర్ కొంతసేపు క్రీజులో ఉన్న తర్వాత నేను ఇప్పటికే చాలాసేపు ఆడానని అనుకుంటాడు. అతడు వరల్డ్ క్రికెట్ లో ఆధిపత్యం చూపాలంటే కొన్ని మార్చుకోవాలి. మ్యాచ్ లను ఫినిష్ చేసే దిశగా అతడు సాధన చేయాలి..
మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను డామినేట్ చేస్తూ ఆడాలి. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రమాదకర ఆటగాళ్లు అనదగ్గవారిలో ముందు వరుసలో ఉండే విరాట్ కోహ్లీ అయినా ఏబీ డివిలియర్స్ అయినా ప్రత్యర్థి బౌలర్లపై చేసేది ఇదే. బాబర్ కూడా ముందు తన స్ట్రైక్ రేట్ మీద దృష్టిసారించాలి. 50 పరుగులు చేయగానే హమ్మయ్యా ఇక నా పని అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. మ్యాచ్ ను ముగించేదాకా ఆడాలి...
ఫిఫ్టీ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడాలి. అప్పుడే బౌలర్లు భయపడతారు. బాబర్ క్రీజులో ఉన్నా ప్రత్యర్థి బౌలర్లు భయపడేంత స్థాయిలో అతడి ఆట ఉండటం లేదు. దానిని మార్చుకోవాలంటే బాబర్ తన స్ట్రైక్ రేట్ ను పెంచుకోవాలి. అది బాబర్ కు వ్యక్తిగతంగానే గాక జాతీయ జట్టుకూ మంచిది..’అని కామెంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.