
ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టేందుకు స్పిన్ ఉచ్చుని సిద్ధం చేసిన టీమిండియా, అదే ఊబిలో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ఇండోర్ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 33.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది..
మొదటి 11.2 ఓవర్లలోనే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టు, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ చిన్నచిన్న భాగస్వామ్యాల కారణంగా కోలుకుంటున్నట్టు కనిపించినా ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది..
ఇన్నింగ్స్ తొలి బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రోహిత్ శర్మ. తొలి బంతికే స్టార్క్ బౌలింగ్లో రోహిత్ బ్యాటుని తాకుతూ వెళ్లిన బంతి, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.. అయితే అంపైర్ నాటౌట్గా ప్రకటించడం, ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో రోహిత్కి లైఫ్ దక్కింది...
అదే ఓవర్ నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం అప్పీలు చేసింది ఆస్ట్రేలియా. అయితే ఈసారి కూడా అంపైర్ నాటౌట్గా ఇచ్చాడు. ఆస్ట్రేలియా డీఆర్ఎస్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో తొలి నాలుగు బంతుల్లో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రోహిత్ శర్మ. ఐదో బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచిన రోహిత్ శర్మ, తనకి వచ్చిన లైఫ్లను సరిగ్గా వాడుకోలేకపోయాడు..
23 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ముందుకి వచ్చి స్టంపౌట్ అయ్యాడు. కుహ్నేమన్ వేసిన తొలి ఓవర్లో మొదటి నాలుగు బంతులను ఫేస్ చేయడానికి తెగ ఇబ్బందిపడిన రోహిత్, ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించి పెవిలియన్ చేరాడు...
తొలి ఇన్నింగ్స్లో స్టంపౌట్ ద్వారా రోహిత్ శర్మ అవుట్ కావడం రెండోసారి. ఇంతకుముందు 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రోహిత్ శర్మ ఇలాగే తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికి టీమిండియా స్కోరు 317 పరుగులు. నేటి మ్యాచ్లో 27 పరుగులకే రోహిత్ అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ కూడా మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వత ఛతేశ్వర్ పూజారా, నాథన్ లియాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 బంతులు ఆడిన పూజారా, 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో ఛతేశ్వర్ పూజారా అవుట్ కావడం ఇదే 12వ సారి..
36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రవీంద్ర జడేజా, నాథన్ లియాన్ బౌలింగ్లో మ్యాట్ కుహ్నేమన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. కుహ్నేమన్ బౌలింగ్లో అయ్యర్ బ్యాటుకి తాగిన బంతి, నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
ఈ దశలో విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ కలిసి ఆరో వికెట్కి 25 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 52 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని టాడ్ ముర్ఫీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 70 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...
30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 17 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, నాథన్ లియాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న ఆసీస్కి ఫలితం కలిసి వచ్చింది. 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా, లంచ్ బ్రేక్కి వెళ్లింది..
3 పరుగులు చేసిన అశ్విన్ కూడా కుహ్నేమన్ బౌలింగ్లో అవుట్ కాగా క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి టీమిండియా స్కోరుని 100 పరుగులు దాటించాడు. ఆ తర్వాత లేని పరుగు కోసం ప్రయత్నించిన మహ్మద్ సిరాజ్ రనౌట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 109 పరుగుల వద్ద తెరపడింది. అక్షర్ పటేల్ 12 పరుగులతో నాటౌట్గా నిలిచాడు..