Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడా? ఫైనల్ ముందు గిల్ ఏం చెప్పాడంటే!

Published : Mar 09, 2025, 12:11 AM IST
Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడా? ఫైనల్ ముందు గిల్ ఏం చెప్పాడంటే!

సారాంశం

Rohit Sharma Retirement: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rohit Sharma Retirement: దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు, రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై టీమ్‌లో ఎలాంటి చర్చ జరగలేదని ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. కెప్టెన్‌తో సహా అందరి దృష్టి ఫైనల్‌పైనే ఉందని అన్నాడు. రోహిత్ భవిష్యత్తు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని గిల్ కొట్టిపారేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, వ్యక్తిగతంగా తనతో కానీ రిటైర్మెంట్ పై ఎలాంటి మాటలు లేవని చెప్పాడు. 

"డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, నాతో కానీ ఎలాంటి డిస్కషన్ జరగలేదు. రోహిత్ భాయ్ కూడా అందరిలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ గురించే ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైతే ఏమీ లేదు," అని అన్నాడు. ఫైనల్ అయ్యాక రోహిత్ నిర్ణయం తీసుకోవచ్చని గిల్ చెప్పాడు: "నాకు తెలిసి రేపటి మ్యాచ్ అయిపోయాక ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. దాని గురించి ఇప్పుడైతే ఏం లేదు అని గిల్ స్పష్టం చేశాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పైనే కన్ను

 

భారత్ మరో ఐసీసీ టైటిల్‌పై కన్నేసింది. ఈ కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడానికి రోహిత్ శర్మ అనుభవం, నాయకత్వం చాలా ముఖ్యం. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు ఓడిపోలేదు. మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలో కీవీస్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో బాగానే ఉంది. ఇది 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సీక్వెల్‌లా ఉండబోతోంది. అప్పుడు న్యూజిలాండ్ గెలిచింది. 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బ్లాక్‌క్యాప్స్ చేతిలో ఓడిపోయినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే కీవీస్ కు ఇచ్చిపడేసిన భారత్ !

 

గత వారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ను 46వ ఓవర్లో 205 పరుగులకే ఆలౌట్ చేసింది. యూఏఈలో స్పిన్ బౌలర్లు రాణిస్తారని అందరూ అనుకుంటే.. బ్లాక్ క్యాప్స్ తరఫున మాట్ హెన్రీ బంతితో అదరగొట్టాడు. 8 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 98 బంతుల్లో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేన్ విలియమ్సన్ 81 (120 బంతులు)తో కీవీస్ తరఫున పోరాడాడు కానీ మిడిల్ ఆర్డర్‌లో అతనికి సపోర్ట్ దొరకలేదు. భారత స్పిన్నర్లు 9 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి 5/42తో అదరగొట్టాడు. 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్‌కు ఇది రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరులో తలపడే జట్లు ఇవే: 

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్. 

న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓ'రూర్కే, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!