
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ మంచి ఆటగాళ్లే. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ రికార్డుల వరద పారిస్తూ ఉంటారు. టీమిండియా విజయాల్లో వీరిద్దరిది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే.. ఐపీఎల్ విషయానికి వస్తే మాత్రం.. కెప్టెన్ గా రోహిత్ శర్మ రాణించినంతగా.. విరాట్ రాణించలేకపోయాడు. కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దీంతో.. వీరిద్దరి కెప్టెన్సీ పై గతంలో చాలా సార్లు చర్చలు జరిగాయి. కాగా.. తాజాగా ఈ విషయంపై న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరే అండర్సన్ స్పందించాడు. కెప్టెన్సీ విషయంలో వారిద్దరి మధ్య ఉన్న తేడాను ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
'2008 అండర్-19 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడి సరిగ్గా పదేళ్ల తర్వాత 2018లో అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కొత్తగా అనిపించింది. కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో పెద్ద తేడా కనిపించదు. ఇద్దరి ఆలోచన విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఇద్దరు గొప్ప నాయకులే. అయితే ఐపీఎల్లో కోహ్లీతో పోలిస్తే.. రోహిత్ కాస్త ముందుంటాడు. కోహ్లీ చాలా ఎమోషన్ చూపిస్తాడు. వారిద్దరూ ఉత్తమ బ్యాట్స్మన్లు, జట్టు బాధ్యతలు మోస్తారు. సహజసిద్ధ కెప్టెన్లు' అని అండర్సన్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ ఆటను ఎంతో ప్రేమిస్తూ గెలవాలని అనుకుంటాడని అండర్సన్ పేర్కొన్నాడు. దానిని రోహిత్ చాలా రహస్యంగా ఉంచుతాడని.. కానీ కోహ్లీ దానిని బయటకు చూపిస్తాడని అండర్సన్ పేర్కొన్నాడు. కోహ్లీకి ఎమోషన్స్ ఎక్కువని ఆయన అన్నారు.