
ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో గాయపడి, జట్టుకి దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. తాను కోలుకోవడం మొదలెట్టానని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు జడ్డూ.
‘సర్జరీ సక్సెస్ఫుల్గా ముగిసింది. నాకు అండగా నిలిచిన బీసీసీఐకి, నా టీమ్మేట్స్కి, సపోర్ట్ స్టాఫ్కి, ఫిజియోలకు, డాక్టర్లకు, నా అభిమానులకు థ్యాంక్స్... నేను కోలుకోవడం మొదలెట్టా. త్వరలోనే మళ్లీ వస్తాను... నాకు విషెస్ తెలిపిన అందరికీ థ్యాంక్స్...’ అంటూ పోస్ట్ చేశాడు రవీంద్ర జడేజా...
ఆసియా కప్లో రెండు మ్యాచులు ఆడిన రవీంద్ర జడేజా, సూపర్ 4 రౌండ్లో పాకిస్తాన్తో మ్యాచ్కి ముందు గాయంతో దూరమయ్యాడు. ఆ తర్వాత అతని గాయం తగ్గడానికి మూడు నుంచి ఆరు నెలల వరకూ సమయం పడుతుందనే వార్త వచ్చింది... దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా రవీంద్ర జడేజా అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది...
రాహుల్ ద్రావిడ్ మాత్రం టీ20 వరల్డ్ కప్ సమయానికి రవీంద్ర జడేజా కోలుకుంటాడని, టీమ్కి అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా రవీంద్ర జడేజా గాయాలతో సావాసం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడుతూ గాయపడిన రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేదు.
ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంకలతో జరిగిన సిరీస్లు ఆడిన రవీంద్ర జడేజా... ఐపీఎల్ 2022 టోర్నీకి సీఎస్కే కెప్టెన్గా ప్రారంభించాడు. భారీ అంచనాలు, ఆశలతో ఐపీఎల్ సీజన్ని ప్రారంభించిన జడ్డూకి ఈసారి ఏదీ పెద్దగా కలిసి రాలేదు...
8 మ్యాచులాడిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా, మాహీ కెప్టెన్సీలో ఓ మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లీ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే ఈ గాయం తీవ్రతపై బాగా చర్చ జరిగింది...
గాయం కారణమో లేక ఐపీఎల్ తర్వాత రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావించడం వల్లనేమో కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో కూడా జడేజా కనిపించలేదు. గాయం నుంచి కోలుకున్నాక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జడ్డూ.. అక్కడ మరోసారి గాయపడ్డాడు.
ఫలితంగా వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ ఆడలేదు. జింబాబ్వే సిరీస్లో విశ్రాంతి తీసుకుని ఆసియా కప్ ఆడుతున్న జడేజా.. రెండు మ్యచులు మాత్రమే ఆడి మళ్లీ గాయపడ్డాడు. గత రెండేళ్లలో రవీంద్ర జడేజాకి ఇది రెండో సర్జరీ కూడా..