
RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ కు సర్వం సిద్ధమైంది. అద్భుతమైన ఆటతో ఫైనల్ కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) లు తుదిపోరుకు సిద్ధంగా ఉన్నాయి.
ఫైనల్ మ్యాచ్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సారి ట్రోఫీని తమ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి అందించాలని తాము టార్గెట్ పెట్టుకున్నామని పాటిదార్ తెలిపాడు. జూన్ 3న పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగే టైటిల్ పోరులో విజయం సాధించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పాడు.
“విరాట్ కోహ్లి కోసం మేము ఈ సారి ట్రోఫీ గెలవాలని చూస్తున్నాం. దేశం కోసం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కోసం ఆయన చేసిన సేవలు అపూర్వం.. వాటిని ఎప్పటికీ మర్చిపోలేము” అని పటదార్ అన్నారు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆర్సీబీ నాలుగు సార్లు ఫైనల్ కు చేరుకుంది. కానీ, ఒక్కసారి కూడా టైటిల్ ను అందుకోలేకపోయింది. తమ నాల్గో ఫైనల్ లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని అందుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. గతంలో 2009, 2011, 2016 ఫైనల్స్లో ఆర్సీబీ ఓడిపోయింది.
అయితే 2025లో గతంలో జట్ల కంటే భిన్నంగా.. అన్ని విభాగాల్లో బలంగా ఉంది. క్వాలిఫయర్ 1లో బెంగళూరు జట్టు పంజాబ్ను కేవలం 101 పరుగులకే ఆలౌట్ చేయగా, ఆ టార్గెట్ ను 10 ఓవర్లలో పూర్తి చేసింది. ఫైనల్ పోరులో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.
ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ మాట్లాడుతూ.. ఆల్రౌండర్ టిమ్ డేవిడ్ గాయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందనీ, ఆయన లభ్యతపై డాక్టర్లు ఈ సాయంత్రం నిర్ణయం తీసుకుంటారు” అని చెప్పారు. ఇక విరాట్ కోహ్లి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన అందిస్తూ 600 పరుగుల మార్క్ను దాటాడు. ఎనిమిది హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ 8 హాఫ్ సెంచరీలు కూడా అన్ని గెలిచిన మ్యాచ్ లలో నే రావడం విశేషం.
ఆర్సీబీ అభిమానులు, విరాట్ కోహ్లి అభిమానులు ఈ ఫైనల్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కోహ్లి 18 ఏళ్లుగా బెంగళూరు జట్టుతో ఉన్నా ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. అయితే, ఈ సారి ట్రోఫీని అందుకోవాలని చూస్తోంది.