
ముగింపు దశకు చేరుకున్న ఐపీఎల్ -2022 లో ఆదివారం గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ లో విజేత ఎవరవుతారని క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే నేటి మ్యాచ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తున్నది. ఈ మేరకు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తిచేశారు. సుమారు 1,25,000 మంది ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పోలీసులు స్టేడియం, దాని పరిసర ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
ఈ మ్యాచ్ కోసం 6000 మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు సమాచారం. స్టేడియం దగ్గర 17 మంది డీసీపీలు, నలుగురు డీఐజీలు, 28 మంది ఏసీపీలు, 51 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 268 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5,000 మందికి పైగా కానిస్టేబుళ్లు, వెయ్యి మందికి పైగా హోంగార్డులు, మూడు కంపెనీల ఎస్ఆర్పీలు బందోబస్త్లో పాల్గొంటున్నారని అహ్మదాబాద్ సిటీ కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
ఒక ఫైనల్ మ్యాచ్ కోసం ఇంత భద్రత ఏర్పాట్లను అరుదు. ప్రధాని, హోంమంత్రి లు వస్తున్నారనే పోలీసులు ఇంత హంగామా చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నెటిజన్లు బీసీసీఐ, బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు బీసీసీఐ అంటే బీజేపీ అని, సెలెక్షన్ కమిటీతో పాటు మ్యాచుల షెడ్యూల్ కూడా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇప్పుడు బీసీసీఐ అంటే బీజేపీనే. దాదా, షా వచ్చినప్పటినుంచి సెలెక్షన్ లో గానీ మ్యాచ్ షెడ్యూల్ లో గానీ బీజేపీ వేలు పెడుతూనే ఉంది..’ అని పేర్కొన్నాడు. మోహిత్ 45 అని రాసిఉన్న ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ‘షా లు భారత రాజకీయాలను, క్రికెట్ ను భ్రష్టు పట్టిస్తున్నారు..’ సదాఫ్ షమీమ్ అని రాసి ఉన్న ఓ యూజర్ స్పందిస్తూ.. ‘నరేంద్ర మోడీ (గుజరాత్ టైటాన్స్) ఈ మ్యాచ్ లో విజేత కాడని నా ప్రగాఢ విశ్వాసం..’అని రాసుకొచ్చాడు.
అయితే ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మోడీ, షాలు స్టేడియానికి రానున్నారని.. ఇక్కడ్నుంచే ఎన్నికల నగారా మోగించనున్నారని పలువురు రాజకీయ విమర్శకులు వాదిస్తున్నారు. మోడీ, షాలు క్రికెట్ ను కూడా వదలడం లేదని వాపోతున్నారు. నేటి మ్యాచ్ లో సుమారు లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరుకానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేసుకోవచ్చునని విమర్శించే వాళ్లూ లేకపోలేదు.