
ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా భారత్ లో 2008 లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నది. క్రికెటర్లకు, క్రికెట్ బోర్డులకే కాదు వ్యాపార సంస్థలకు కోటానుకోట్ల రూపాయలను కురిపిస్తున్నది. ఐపీఎల్ లో లేకుంటే (యాడ్స్ లో) లేకుంటే భారత మార్కెట్ లో నిలదొక్కుకోవడం కష్టం అన్నంత మాదిరిగా దాని క్రేజ్ విస్తరించిందంటే ఈ లీగ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా లీగ్ ద్వారా వేలాది కోట్లు ఆర్జిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ రూ. 20 కోట్లు. కాగా వచ్చే ఏడాది నుంచి దీనిని పెంచేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది.
ఈ మేరకు ఇన్సైడ్ స్పోర్ట్స్ లో వచ్చిన కథనం ప్రకారం.. బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇదే విషయమై మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ విన్నర్ ప్రైజ్ మనీ 20-25 శాతం పెంచనున్నట్టు చెప్పాడు.
సదరు అధికారి మాట్లాడుతూ.. ‘ఆ విషయం (ప్రైజ్ మనీ పెంపు) ప్రస్తుతం మా చర్చల్లో ఉంది. ఐపీఎల్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని 20-25 శాతం పెంచే యోచనలో బోర్డు ఉంది. అయితే ఎంత అమౌంట్ అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే ఏడాది సీజన్ ప్రారంభానికి ముందు దీనిపై అధికారిక ప్రకటన వెల్లడిస్తాం..’ అని తెలిపాడు.
2018 లో బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ప్రైజ్ మనీని రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు (మధ్యలో కరోనా కారణంగా 2020 సీజన్ లో విజేతలకు రూ. 10 కోట్ల ప్రైజ్ మనీనే దక్కింది) పెంచింది. తర్వాత నాలుగు సంవత్సరాలుగా మళ్లీ దాని ఊసెత్తలేదు. ఈ ఏడాది లీగ్ లో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వడం.. ప్రమోటర్లు, స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టింగ్, మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ కోటానుకోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న నేపథ్యంలో ఫైనల్ విజేత ప్రైజ్ మనీ పెంపు విషయం కూడా చర్చలోకి వచ్చింది.
ఐపీఎల్ -2022 ప్రైజ్ మనీ ఇలా..
- విజేత : రూ. 20 కోట్లు
- రన్నరప్ : రూ. 13 కోట్లు
- మూడో స్థానంలో నిలిచిన జట్టు : రూ. 7 కోట్లు
- నాలుగో స్థానం జట్టుకు : రూ. 6.5 కోట్లు
ఐపీఎల్ విజేత కు అందజేసే ప్రైజ్ మనీ ని పెంచాలని గతంలో వాదనలు వినిపించినా కరోనా కారణంగా అది జరగలేదని బీసీసీఐ ప్రతినిధి చెప్పారు. ‘అవును. కొన్ని సంవత్సరాలుగా ప్రైజ్ మనీ పెరగలేదు. కానీ ఈ మధ్యలో మూడు సీజన్లుగా కోవిడ్ తో మనం సావాసం చేస్తున్నాం. కోవిడ్ వల్ల ఆటగాళ్లకు అయ్యే ఖర్చు కూడా తడిసి మోపెడవుతున్నది. కానీ వచ్చే ఏడాది కచ్చితంగా పెంపు ఉంటుంది..’ అని తెలిపారు.