
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ.. శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో ప్రారంభం కాబోయే తొలి టెస్టుతో భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ కాబోతున్నాడు. మొహాలీ టెస్టు భారత వెటరన్ విరాట్ కోహ్లి కెరీర్ లో వందో టెస్టు.. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు విలేకరులతో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ప్రశ్నలు అడుగుతున్నవాళ్లంతా కరెక్ట్ క్వశ్చన్స్ అడగడం లేదని.. అది తనకే మంచిదైందని ఫన్నీ గా చెప్పాడు.
మీడియాతో వర్చువల్ సమావేశం సందర్బంగా రోహిత్ కు అప్పటిదాకా కోహ్లి, ఇతర విషయాల గురించే ప్రశ్నలు అడిగారు పాత్రికేయులు.. అయితే ఓ విలేకరి మాత్రం.. ‘పిచ్ ఎలా ఉంది..? ఔట్ ఫీల్డ్ ఎలా ఉంది..? మ్యాచుకు ప్రేక్షకులు వస్తున్నారు కదా.. ఎలా అనిపిస్తుంది..?’ అని అడిగాడు.
ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ‘ఇది.. ఇదీ అసలైన ప్రశ్న.. ఇప్పటిదాకా ఈ సమావేశంలో ఎవరూ నన్ను ఈ ప్రశ్న అడగలేదు. పిచ్ ఎలా ఉంది.. టీమ్ కాంబినేషన్ ఏమిటి..? ప్రేక్షకులు రావడంపై మీ స్పందన.. ఇవి కదా అడగాల్సింది. కానీ ఎవరూ నన్ను అడగడం లేదు. ఇదే అసలైన సవాల్..’ అని నవ్వుతూ చెప్పాడు.
కాగా.. తనకు ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఉంటేనే బాగుంటుందని హిట్ మ్యాన్ చెప్పడం విశేషం. ‘ఈ ప్రశ్నలు అడిగితేనే నాకు బాగుంటుంది. ఇక పిచ్ విషయానికి వస్తే కొంత డ్రై గా కనిపిస్తున్నది. అది స్పిన్నర్లకు ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. ఉదయం ఇక్కడ కొంత చలిగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మొహాలీ పిచ్ అనేది కొంచెం కఠినమైన పిచ్. ఇక మ్యాచులో ప్రేక్షకుల గురించి చెప్పాలంటే.. ఎవరికైనా అభిమానుల మధ్యలో ఆడటం బాగానే ఉంటుంది. కోహ్లి తన వందో టెస్టు ఆడబోతున్నాడు. అది అతడితో పాటు జట్టుకు కూడా మంచిది..’ అని హిట్ మ్యాన్ చెప్పాడు.
కాగా ముందు ఈ మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. విరాట్ కోహ్లి అభిమానుల ఆగ్రహంతో దిగొచ్చింది. మొహాలీలో కరోనా కేసుల దృష్ట్యా అక్కడ ఖాళీ స్టేడియంలోనే మ్యాచును నిర్వహించాలని భావించింది. కానీ బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అభిమానులు మండిపడ్డారు. విండీస్, శ్రీలంక తో టీ20లకు అభిమానులను అనుమతించి.. తొలి టెస్టు తర్వాత బెంగళూరులో నిర్వహించబోయే టెస్టులో కూడా ప్రేక్షకుల మధ్యలో జరిపి కోహ్లి నూరో టెస్టులో మాత్రం ఇలా చేయడం ఏమాత్రం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కోహ్లిపై కక్ష సాధింపుచర్యగా అభివర్ణించారు. బీసీసీఐకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ఓ క్యాంపెయిన్ కూడా నడిపారు. దీంతో బీసీసీఐ దిగొచ్చింది. 50 శాతం ప్రేక్షకులతో తొలి టెస్టు నిర్వహణకు అంగీకారం తెలిపింది.