
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక.. క్రైస్ట్చరచ్చ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పట్టబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన స్కోరు చేసి కివీస్ పై ఆధిపత్యం చెలాయించిన లంక.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదే తరహా ఆటతో కివీస్ కు చెమటలు పట్టిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి కివీస్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 355 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ జట్టులో సారథి కరుణరత్నె (50) హాఫ్ సెంచరీతో రాణించగా కుశాల్ మెండిస్ (87), ఏంజెలో మాథ్యూస్ (47), ధనుంజయ డిసిల్వ (46) లు మెరుగ్గా ఆడారు. కివీస్ సారథి టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులే చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ (67), డెవాన్ కాన్వే (30) లు తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు. కానీ కాన్వేను ఫెర్నాండో ఔట్ చేసిన తర్వాత కివీస్ వరుసగా మరో రెండు కీలక వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లాండ్ తో గత మ్యాచ్ లో సెంచరీ చేసిన కేన్ విలిమయ్సన్.. ఒక్క పరుగే చేసి లాహిరు కుమార బౌలింగ్ లో కరుణరత్నెకు క్యాచ్ ఇవ్వగా హెన్రీ నికోలస్ రెండు పరుగులు చేసి అదే కుమార బౌలింగ్ లో రజిత చేతికి చిక్కాడు. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (7) కూడా విఫలమయ్యాడు.
ప్రస్తుతం కివీస్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ (89 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో పాటు మైఖేల్ బ్రాస్వెల్ (9 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఆట మూడో రోజు ఈ ఇద్దరినీ ఉదయం పూటే ఔట్ చేస్తే కివీస్ కు అది కోలుకోలేని దెబ్బే. ఈ ఇద్దరూ నిష్క్రమిస్తే తర్వాత వచ్చేవారిలో కెప్టెన్ టిమ్ సౌథీ ఒక్కడే బ్యాటింగ్ చేయగలడు.
కాగా ఈ మ్యాచ్ లో లంక గనక కివీస్ కు షాకిస్తే అది భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ పై కూడా ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఓడితే అది భారత్ కు ముప్పే. అప్పుడు లంక.. కివీస్ ను తొలి టెస్టుతో పాటు రెండో టెస్టులోనూ ఓడిస్తే ఆస్ట్రేలియాతో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో లంక తలపడుతుంది. అయితే భారత్ డ్రా చేసుకుంటే మాత్రం లంకకు అవకాశాలుండవు.