యూఏఈలో ఐపీఎల్.. ఆటగాళ్లకు రోజూ కరోనా టెస్టులు చేయాలి: బీసీసీఐకి వాడియా సూచనలు

By Siva KodatiFirst Published Jul 25, 2020, 2:30 PM IST
Highlights

యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్న నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్న నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రతీరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.

త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని బీసీసీఐ తయారు చేయనుంది. ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా ఖచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలని నెస్ వాడియా అన్నారు.

ప్రతిరోజూ కరోనా పరీక్షలకు నేనైతే అభ్యంతరం చెప్పనన్నారు. లీగ్‌లో ఎనిమిది జట్లు ఉంటాయని.. కాబట్టి ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదని వాడియా అభిప్రాయపడ్డారు.

Also Read:ఐపీఎల్ 2020: స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి..?, అందుకే దుబాయి..!

కోవిడ్ 19 పరీక్షల విషయంలో యూఏఈ ప్రభుత్వ పనితీరును ఆయన ప్రశంసించారు. అందువల్ల బీసీసీఐ కూడా అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలని వాడియా సూచించారు. మరోవైపు కరోనా కష్టకాలంలో ఐపీఎల్‌కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను వాడియా తోసిపుచ్చారు.

నిజానికి అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఏ ఐపీఎల్‌కూ లభించని వీక్షాకాదరణ టీవీల్లో ఈసారి లీగ్‌కు దక్కనుందని వాడియా అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారని.. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణమని నెస్ వాడియా పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్‌ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందని వాడియా ఆకాంక్షించారు. 

click me!