
ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ లో జరుగుతున్న చర్చలు ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్దకూ వెళ్లాయి. పాక్ కు 1992లో వన్డే వరల్డ్ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్.. తాజాగా భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలం వల్ల బీసీసీఐ తనకు నచ్చినట్టుగా వ్యవహరించడం సరికాదని, అహంకార ధోరణి మంచిది కాదని అన్నారు. అత్యధిక ఆదాయం ఇస్తున్నందున ,నియంతలా వ్యవహరిచంకూడదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో పాకిస్తాన్ క్రికెటర్లను అనుమతించకపోవడంపైనా ఇమ్రాన్ స్పందించారు.
టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా బాధాకరం (పాక్ ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడించకపోవడం). బీసీసీఐ పాకిస్తాన్ క్రికెటర్లను టార్గెట్ చేస్తోంది. ఇది వారి అహంకారినికి నిదర్శనం...
అయినా బీసీసీఐ వారికి ఐపీఎల్ నుంచి నిషేధించగలదేమో గానీ మిగతా లీగ్ ల నుంచి కాదు. వాళ్ల (పాక్ క్రికెట్) కు ఇప్పుడు స్వంతంగా ఓ క్రికెట్ లీగ్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) ఉంది. ఇక్కడ పాక్ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లూ భాగమవుతున్నారు. బీసీసీఐ తమకు ఎవరు కావాలని కోరుకుంటుందో వారినే ఎంపిక చేసుకుని లీగ్ లో ఆడిస్తున్నది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు ఆ దేశం అత్యధిక ఆదాయం గడిస్తున్న దేశంగా ఉంది. అందువల్లే వాళ్లు (బీసీసీఐ) తాము సూపర్ పవర్ అనుకుంటున్నారు. ఇది అహంకార ధోరణికి నిదర్శనం..’ అని చెప్పారు.
ఐపీఎల్ లో ఆడలేదని బాధపడాల్సిన అవసరం లేదని.. పాక్ క్రికెటర్లు దేశవాళీతో పాటు జాతీయ జట్టుకు ఆడి అంతర్జాతీయ వేదికలమీద తమ సత్తా చాటాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. పాక్ లో మెరుగైన ఆటగాళ్లకు కొదవలేదని పాక్ మాజీ సారథి అన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు తొలి ఎడిషన్ లో ఆడారు. షోయభ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది వంటి ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు. కానీ ఇరు దేశాల మధ్య రాజకీయ, సరిహద్దు వివాదాల కారణంగా పాకిస్తాన్ క్రికెటర్లపై బీసీసీఐ బ్యాన్ విధించింది.
ఇక ఆసియా కప్ నిర్వహణ వివాదం తర్వాత పాకిస్తాన్ లేవనెత్తిన కొత్త సమస్యపైనా జోరుగా చర్చ సాగుతోంది. ఆసియా కప్ ఆడేందుకు భారత్.. పాక్ కు రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు రాబోమని.. తమకు తటస్థ వేదిక కావాలని కొత్త రాగం అందుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఐసీసీకి కూడా లేఖ రాసింది. మరి ఈ విషయంలో ఐసీసీ ఏమంటుందో చూడాలి.