
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. శనివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు వేదికగా ఐపీఎల్-15 సీజన్ కోసం మెగా వేలం ప్రారంభం కాబోతున్నది. రెండ్రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ ను అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు.
టాటా ఐపీఎల్ 2022 వేలం బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్ లో రెండ్రోజుల పాటు జరుగుతుంది. ఈ మెగా వేలాన్ని మీరు కూడా స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ లో చూడొచ్చు. ఆ మేరకు స్టార్ స్పోర్ట్స్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం..
జరిగేది ఎక్కడ..?
బెంగళూరు లోని ఐటీసీ గార్డెన్ లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. అయితే పది ఫ్రాంచైజీల ప్రతినిధులందరూ శనివారం ఉదయం 11 గంటలకే (గంట ముందు) అక్కడకు చేరుకోవాలి. కరోనా నిబంధనలను పాటిస్తూ వేలాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ.. ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇలా చూడొచ్చు..
ఐపీఎల్ వేలం ప్రక్రియను స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. హిందీ, ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, కన్నడ, తమిళంలో కూడా వేలం లైవ్ ను వీక్షించొచ్చు. మొత్తం 8 నెట్వర్క్ (స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ) లలో ఆక్షన్ లైవ్ ను చూడొచ్చు. టీవీలతో పాటుగా.. డిస్నీ హాట్ స్టార్ లో కూడా దీనిని చూడొచ్చు.
ఆక్షన్ ముచ్చట్లు :
- వేలంలో పాల్గొనబోయే ఫ్రాంచైజీలు 10.. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య 33.
-వేలంలో ఉన్న ఆటగాళ్లు 590 (ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు సమాచారం). ఇందులో ఇండియా నుంచి 370 మంది ఉండగా.. 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
- హయ్యస్ట్ బేస్ ప్రైజ్ (రూ. 2 కోట్లు) లో ఉన్న ఆటగాళ్లు 48 మంది. ఇందులో భారత ఆటగాళ్లు 17 మంది ఉన్నారు. ఇక రూ. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైస్ జాబితాలోఇండియా నుంచి 20 మంది క్రికెటర్లు ఉన్నారు. కోటి రూపాయల రిజర్వ్ ధరలో 34 మంది ఉన్నారు.
- మొత్తం వేలంలో రూ. 900 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఇప్పటికే రిటెన్షన్ ద్వారా రూ. 384.5 కోట్లు ఖర్చు చేశాయి. అది పోగా ఫ్రాంచైజీ దగ్గర మిగిలిన మొత్తం రూ. 561.5 కోట్లు
- శని, ఆదివారాలలో జరుగబోయే వేలంలో రూ. 561.5 కోట్లను 217 మంది (ఇన్ని స్లాట్లు ఉన్నాయి) ప్లేయర్ల మీద ఖర్చు చేయవచ్చు.