
చేధించాల్సింది 204 పరుగుల లక్ష్యం. ఉన్నవి 20 ఓవర్లు. కాస్త ట్రై చేసినా ఇదేం పెద్ద లక్ష్యం కాదు. కానీ కొండను చూసి ముందే భయపడ్డారో లేక రాజస్తాన్ బౌలింగ్ లైనప్ ను తట్టుకోవడవం కష్టమనుకున్నారో గానీ ఛేదనలో సన్ రైజర్స్ .. స్కోరు బోర్డుపై పరుగులేమీ చేయకుండానే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తో పాటు వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కూడా ఔటయ్యారు.
ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో మూడో బంతికి అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యార్కర్ గా వచ్చిన బంతిని అడ్డుకోవడంలో అభిషేక్ విఫలమవడంతో బంతి నేరుగా ఆఫ్ స్టంప్ ను పడగొట్టింది. ఆ తర్వాత బంతికే రాహుల్ త్రిపాఠి.. ముందుకొచ్చి ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి స్లిప్స్ లో ఉన్న జేసన్ హోల్డర్ చేతుల్లో పడింది. దీంతో బౌల్ట్ డబుల్ వికెట్ మెయిడిన్ ఓవర్ అయింది.
అసలే ఛేదించాల్సిన లక్ష్యం 204 పరుగులు ఉండగా సన్ రైజర్స్ మాత్రం.. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోవడంతో హ్యారీబ్రూక్, మయాంక్ అగర్వాల్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. వీళ్ల తర్వత గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే ధాటిగా ఆడగలడు. వాషింగ్టన్ సుందర్ ఉన్నా భారీ షాట్లు ఆడటం అనుమానమే. మరి రూ. 13.5 కోట్ల ఇంగ్లాండ్ కుర్రాడు హైదరాబాద్ ను ఆదుకుంటాడా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరం.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. జైస్వాల్ బౌండరీతో ఖాతా తెరిచాడు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో బట్లర్.. ఓ భారీ సిక్సర్ కొట్టగా జైస్వాల్ రెండు బౌండరీలు కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన నాలుగో ఓవర్లో బట్లర్ మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లోనే రాజస్తాన్ స్కోరు 50 పరుగుల మార్క్ ను దాటింది.
నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో బట్లర్ నాలుగు ఫోర్లు బాదాడు. ఫజుల్లా ఫరూఖీ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బంతికి మరో బౌండరీ బాది ఐదో బాల్ కు బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్ ఏకంగా 85 పరుగులు చేసింది. పవర్ ప్లే లో రాజస్తాన్ కు ఇదే హయ్యస్ట్ స్కోరు.బట్లర్ స్థానంలో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ ఏం తక్కువ తిన్లేదు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శాంసన్.. అతడే వేసిన తర్వాతి ఓవర్లో భారీ సిక్సర్ కూడా బాదాడు. 8 ఓవర్లకే వంద పరుగులు చేసిన రాజస్తాన్.. పది ఓవర్లు ముగిసేసరికి 122 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా జైస్వాల్ కూడా అర్థ సెంచరీ (34 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.
శాంసన్-జైస్వాల్ లు రెండో వికెట్ కు 54 పరుగులు జోడించారు. కానీ ఫజుల్లా ఫరూఖీ హైదరాబాద్ కు మరో బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన 13వ ఓవర్లో మూడో బంతికి జైస్వాల్. మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 15వ ఓవర్లో దేవదత్ పడిక్కల్ (2) కూడా బౌల్డ్ అయ్యాడు. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో రియాన్ పరాగ్ (7) కూడా ఫరూఖీకి క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో సామ్సన్.. మూడో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే నటరాజన్ వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మ కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో షిమ్రన్ హెట్మెయర్ (16 బంతుల్లో 22 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ .. 203 పరుగుల వద్ద నిలిచింది.