
క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ సలీం దురానీ, నేటి ఉదయం (ఏప్రిల్ 2) తుది శ్వాస విడిచారు. స్వాతంత్య్రానంతరం టీమిండియా తరుపున ఆడిన రెండో తరం క్రికెటర్లలో ఒకడైన సలీం దురానీ, అప్పట్లో జనాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు...
దేశ విభజనకి ముందు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఏరియాలో 1934, డిసెంబర్ 11న జన్మించిన సలీం దురానీ పూర్తి పేరు సలీం అజీజ్ దురానీ. దేశ విభజన తర్వాత ఇండియాకి తరలివచ్చిన సలీం దురానీ, గుజరాత్లోని జామ్ నగర్లో స్థిరపడ్డారు..
1960లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన సలీం దురానీ, 1961-62 సీజన్లో ఇంగ్లాండ్పై టీమిండియా గెలిచిన టెస్టు సిరీస్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో కోల్కత్తా టెస్టులో 8 వికెట్లు తీసిన సలీం దురానీ, చెన్నైలో జరిగిన టెస్టులో 10 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్పై సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సలీం దురానీ, ఆ తర్వాత వెస్టిండీస్తో మ్యాచ్తోనూ అప్పటి దిగ్గజ బ్యాటర్లు క్లైయివ్ లార్డ్, గ్యారీ సోబర్స్ వికెట్లు తీశాడు..
50 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన సలీం దురానీ, ఓ సెంచరీ కూడా సాధించాడు. 1962లో వెస్టిండీస్పై శతకం చేసిన సలీం దురానీ, గుజరాత్, రాజస్థాన్, సౌరాష్ట్ర తరుపున ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు చేసిన సలీం దురానీ, 3545 పరుగులు చేశాడు..
1973లో కాన్పూర్లో జరిగిన టెస్టులో సలీం దురానీని తుది జట్టు నుంచి తప్పించింది టీమిండియా మేనేజ్మెంట్. ఈ నిర్ణయాన్ని క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయాడు.. ‘నో దురానీ, నో టెస్టు’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి, టీమిండియాపై అసహనాన్ని వ్యక్తం చేశారు....
క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ‘చరిత్ర’ అనే సినిమాలో నటించిన సలీం దురానీ, అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర లిఖించాడు. అంతేకాకుండా 2011లో బీసీసీఐ, సలీం దురానీకి ‘సీ.కే.నాయుడు లైఫ్ టైం అఛీవ్2మెంట్’ అవార్డు ఇచ్చి గౌరవించింది..
88 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు సలీం దురానీ. ఈ ఏడాది జనవరిలో మోకాళ్లకి శస్త్ర చికిత్స చేయించుకున్న సలీం దురానీ, తన తమ్ముడు జహంగీర్ దురానీ ఇంట్లో ఉండేవారు. టీమిండియా తరుపున 29 టెస్టులు ఆడిన సలీం దురానీ, బ్యాటింగ్లో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలతో 1202 పరుగులు చేశాడు. బౌలింగ్లో 74 వికెట్లు పడగొట్టాడు..
సలీం దురానీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాళి ఘటించారు. ‘సలీం దురానీ జీ ఓ క్రికెట్ లెజెండ్. ఆయన ఓ క్రీడా ఇన్స్టిట్యూట్లాండోడు. భారత క్రికెట్ ఎదుగుదలకు ఆయన ఎంతో చేశారు. సలీం దురానీ మృతి కలిచి వేసింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి..
గుజరాత్తో సలీం దురానీకి విడదీయరాని అనుబంధం ఉంది. సౌరాష్ట్ర, గుజరాత్ తరుపున కొన్నేళ్ల పాటు ఆడారు. గుజరాత్ని తన ఇంటికి మార్చుకున్నారు. క్రికెట్లో ఆయన లేని లోటు తీర్చలేనిది..’ అంటూ ట్వీట్లు చేశారు నరేంద్ర మోదీ..
సచిన్ టెండూల్కర్తో పాటు సునీల్ జోషి, మహ్మద్ అజారుద్దీన్, మిథాలీ రాజ్, అనిల్ కుంబ్లే, ఆకాశ్ చోప్రా, రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్ వంటి మాజీ క్రికెటర్లు కూడా సలీం దురానీ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు..
ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు సలీం దురానీ మృతికి సంతాపంగా ఇరు జట్ల ప్లేయర్లు, ప్రేక్షకులు కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు..