
ఐపీఎల్ లో అన్ని ఫ్రాంచైజీలు సీజన్ ప్రారంభానికి ముందు తమ జెర్సీలను రివీల్ చేసి ఆ సీజన్ ముగిసేంతవరకూ వాటిని కొనసాగిస్తాయి. కానీ ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆ జట్టు ప్రతీ ఏడాది ఐపీఎల్ లో తాము ఆడబోయే ఒక మ్యాచ్ లో గ్రీన్ జెర్సీతో ఆడుతుంది. 2011 నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ పద్ధతిని ఈ ఏడాదీ కొనసాగించనున్నది. తాజాగా ఆర్సీబీ తన ట్విటర్ లో.. గ్రీన్ జెర్సీని వేసుకుని మ్యాచ్ ఆడే తేదీని ప్రకటించింది.
ఐపీఎల్ -16లో ఆర్సీబీ - రాజస్తాన్ రాయల్స్ తో ఆడబోయే మ్యాచ్ లో గ్రీన్ జెర్సీ వేసుకోనుంది. ఈ నెల 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది వాళ్ల రెగ్యులర్ జెర్సీలు కాకుండా ఆకుపచ్చ దుస్తులలో మెరుస్తారు.
2011 నుంచి..
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ ను గ్రీన్ జెర్సీలో ఆడటం 2011 నుంచి వస్తున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించే ‘గో గ్రీన్’ క్యాంపెయిన్ కు మద్దతుగా ఐపీఎల్ సీజన్ లో ఆడే ఒక్క మ్యాచ్ లో ఆకుపచ్చ జెర్సీలతో ఆడుతోంది. 2021 సీజన్ లో మాత్రం ఆర్సీబీ.. గ్రీన్ జెర్సీలు కాకుండా బ్లూ జెర్సీలను వేసుకుంది. కరోనాకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మద్దతుగా ఆ ఏడాది బ్లూ జెర్సీ వేసుకుంది.
2019 తర్వాత బెంగళూరులో..
2011 నుంచే ఆర్సీబీ గ్రీన్ జెర్సీ వేసుకుంటున్నా.. 2019 తర్వాత సొంత గ్రౌండ్ లో ఈ జెర్సీతో ఆడటం ఇదే ప్రథమం. 2020, 2021, 2022 లో కరోనా కారణంగా ఆర్సీబీ హోం గ్రౌండ్ (చిన్నస్వామి స్టేడియం) లో మ్యాచ్ లు ఆడలేదు. దీంతో నాలుగేండ్ల తర్వాత సొంత అభిమానుల సమక్షంలో డుప్లెసిస్ అండ్ కో. గ్రీన్ జెర్సీలలో కనువిందు చేయనుంది.
అమ్మో గ్రీన్ జెర్సీనా.. అయితే మ్యాచ్ ఖతం..
గ్రీన్ జెర్సీ వేసుకుని ఆడిన మ్యాచ్ లలో ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆకుపచ్చ జెర్సీలో 12 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. మూడు మ్యాచ్ లలో మాత్రమే నెగ్గింది. 8 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇక ఇవే మ్యాచ్ లల మూడు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలవగా.. రెండో సారి బ్యాటింగ్ చేసిన 8సార్లు ఓడింది. మరి ఈ నెల 23న రాజస్తాన్ రాయల్స్ తో జరుగబోయే మ్యాచ్ లో ఆర్సీబీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.