
ఐపీఎల్ లో రెండు సీజన్ల తర్వాత ముంబై ఇండియన్స్ మళ్లీ ప్లేఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం రాత్రి బెంగళూరు-గుజరాత్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ బౌలర్ల వైఫల్యంతో హార్ధిక్ సేనకు ఈ సీజన్ లో పదో విజయం దక్కడంతో మంబై మురిసింది. ఆర్సీబీ ఓడటంతో ముంబై.. ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. అయితే బెంగళూరు - గుజరాత్ మ్యాచ్ ఫలితం మీద ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడటంతో రోహిత్ సేన ఈ మ్యాచ్ ను ప్రత్యేకంగా వీక్షించింది.
ముంబై ఇండియన్స్ ఉంటున్న హోటల్ లో దాదాపు ఆ జట్టు ఆటగాళ్లు అంతా ఆర్సీబీ - జీటీ మ్యాచ్ చూశారు. గుజరాత్ బ్యాటర్ శుభ్మన్ గిల్.. పార్నెల్ వేసిన ఆఖరి ఓవర్లో ఫస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేయడంతో పాటు బెంగళూరును ఓడించాడు.
గిల్ సిక్సర్ కొట్టగానే టీవీ ముందు కూర్చున్న ముంబై ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. ఇషాన్ కిషన్, పీయూష్ చావ్లా, నెహల్ వధేర, జేసన్ బెహ్రన్డార్ఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ, హృతీక్ షోకీన్ లు తమ సహచర ఆటగాళ్లను హగ్ చేసుకుని సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
బెంగళూరు ఓటమితో ముంబై ఇండియన్స్ కలిసొచ్చినట్టే.. గత సీజన్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఐపీఎల్ - 2022లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ.. ముంబై చేతిలో ఓడిపోవాలి. అప్పుడు.. ఆర్సీబీ అభిమానులతో పాటు టీమ్ మొత్తం ముంబై గెలవాలని కోరుకున్నారు. ఆర్సీబీ టీమ్ మొత్తం ఈ మ్యాచ్ ను స్పెషల్ గా వీక్షించింది. ఇక ఇప్పుడు కూడా ఇదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.
కాగా.. ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు వరకూ ముంబై, బెంగళూరు, రాజస్తాన్ కు సమాన పాయింట్లు (14) ఉండేవి. ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే.. హైదరాబాద్ ను భారీ తేడాతో ఓడించి ఆ తర్వాత బెంగళూరు ఓటమి కోసం వేచి చూడాలి. ఇందులో భాగంగానే హైదరాబాద్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే అందుకున్న ముంబై.. గుజరాత్ చేతిలో బెంగళూరు ఓడాక 16 పాయింట్లో ప్లేఆఫ్స్ లో నాలుగో స్థానాన్ని కన్ఫమ్ చేసుకుంది.
ఇక ప్లేఆఫ్స్ లో ముంబై.. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా మే 24న చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగబోయే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫస్ట్ క్వాలిఫయర్ లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఎలిమినేటర్ లో ఓడిన టీమ్ ఇంటిముఖం పడుతుంది.