
ఐపీఎల్- 2023లో ఆట కంటే ఆటేతర విషయాలతో వార్తలలో నిలుస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్.. మరోసారి తన ఫోన్ కు పనిచెప్పాడు. ఐపీఎల్ - 16 లో ఆదివారం రాత్రి బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిన తర్వాత ఎప్పటిలాగే కోహ్లీ, బెంగళూరు టీమ్ ను ట్రోల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఇన్స్టా స్టోరీస్ లో కోహ్లీ అండ్ ఆర్సీబీని ట్రోల్ చేస్తూ.. ఓ న్యూస్ ప్రెజంటర్ పగలబడి నవ్వే వీడియోను షేర్ చేశాడు. వాస్తవానికి ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ ఆర్సీబీ - లక్నో మధ్య జరుగుతుందని అందరూ భావించారు.
ఈ నెల 1న లక్నో - బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో భాగంగా కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నుంచి కోహ్లీ, నవీన్ తో పాటు గంభీర్ లు కూడా సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులతో ఈ ఫైట్ ను మరింత రసవత్తరంగా మార్చారు. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసులో రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి పోటీలోకి వచ్చిన ఆర్సీబీ.. ఎలిమినేటర్ లో లక్నోతో ఆడనుందని.. అక్కడ నవీన్ కు కోహ్లీ బుద్ది చెబుతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ కోహ్లీ ఫ్యాన్స్ ఒకటి తలిస్తే విధి మరోలా తలచింది.
తాజాగా నవీన్.. కోహ్లీతో పాటు అతడి అభిమానులను కూడా టార్గెట్ చేస్తూ.. ‘మీరు.. ప్లేఆఫ్స్ కు వచ్చి నాకు ధమ్కీ ఇస్తారా..’ అని అర్థం వచ్చేలా ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ‘నీకు ఎప్పుడూ ఇదే పనారా.. ఇన్స్టాగ్రామ్ లో కాకుండా కాస్త బౌలింగ్ మీద దృష్టి పెట్టు..’అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు చేతులు ఎత్తేయడంతో 198 పరుగుల భారీ స్కోరుని టైటాన్స్ ఊదేసింది.. శుబ్మన్ గిల్, వరుసగా ఐపీఎల్ 2023 సీజన్లో రెండో సెంచరీ చేసి, గుజరాత్కి గ్రూప్ స్టేజీలో 10వ విజయాన్ని అందించాడు.. గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరుతూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి టాప్ 4కి అడుగుదూరంలో ఆగిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడంతో సన్రైజర్స్పై గెలిచిన ముంబై ఇండియన్స్, 2 సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్ చేరింది. మే 24న లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.