
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రాజస్తాన్ రాయల్స్ ను వారి స్వంత గ్రౌండ్ లో ఓడించి బంపర్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా రాజస్తాన్.. 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా బెంగళూరు.. 112 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మరి ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీకి ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉన్నాయా..?
రాజస్తాన్ - బెంగళూరు మ్యాచ్ ముగిసేసరికి ఐపీఎల్ -16 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంది. టాప్ -1లో గుజరాత్ (16) ఉండగా తర్వాత చెన్నై (15), ముంబై (14), లక్నో (13) ఉన్నాయి. బెంగళూరు 12 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి ఆరు ఓడి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
ఆర్సీబీతో పాటు రాజస్తాన్ కూడా 13 మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలు ఏడు అపజయాలతో 12 పాయింట్లే సాధించినా ఆర్సీబీకి నెట్ రన్ రేట్ (+0.166) రాజస్తాన్ (+0.140) కంటే మెరుగ్గా ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 12 పాయింట్లతోనే ఏడో స్థానంలో ఉంది.
బెంగళూరు ఛాన్సెస్..!
- ఈ సీజన్ లో ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మే 18న హైదరాబాద్, మే 21న గుజరాత్ తో రెండు మ్యాచ్ లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ లు గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 16 పాయింట్లు చేరతాయి. అయితే 16 పాయింట్లు సాధించినా ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ద ఇతర మ్యాచ్ ల ఫలితాల మీద ఆధారపడతాయి. ఈ సీజన్ లో ముంబై, లక్నోలు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఓడినా ఆ జట్లు కూడా 16 పాయింట్ల వద్దే ఆగిపోతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ఒకవేళ ఆర్సీబీ.. హైదరాబాద్, గుజరాత్ లను భారీ తేడాతో ఓడిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
పంజాబ్నూ దాటాలి...
ఆర్సీబీ తర్వాతి రెండు మ్యాచ్ లను గెలిచినా ముంబై, లక్నోలు ఒక మ్యాచ్ ఓడినా ఆర్సీబీ పంజాబ్ గండం పొంచే ఉంది. పంజాబ్ కూడా 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు కూడా ఈ సీజన్ లో మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో ఏదైనా ఒక మ్యాచ్ పంజాబ్ ఓడితే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా టాప్ -4లోకి ఆర్సీబీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.