
ఐపీఎల్ - 16లో మరో కెప్టెన్ జేబుకు చిల్లుపడింది. అసలే స్లో గా ఆడుతున్నాడని తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్కు బుధవారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు గాను జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు కేఎల్ రాహుల్ పై రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడ్డ సారథులలో రాహుల్ ఐదోవాడు.
రాజస్తాన్ రాయల్స్ తో బుధవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయనందుకు గాను రాహుల్ పై ఈ జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. రాహుల్ గనక మరోసారి ఇదే తప్పు పునరావృతం చేస్తే జరిమానా పెరగనుండటంతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా ఎదురయ్యే ప్రమాదముంది.
రాహుల్ కంటే ముందు ఈ సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రాజస్తాన్ సారథి సంజూ శాంసన్, గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కేకేఆర్ తో మ్యాచ్ లో ముంబైకి స్టాండ్ బై కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ లకు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో రాహుల్ కూడా చేరాడు.
స్లో ఓవర్ రేట్ రూల్..
క్రికెట్ చట్టాలు చేసే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ వెలువరించిన నిబంధనాల మేరకు.. ఓవర్ రేట్ అనేది ఒక గంట ఆటలో ఫీల్గింగ్ సైడ్ బౌలింగ్ చేసే సగటు ఓవర్ల సంఖ్య. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు టెస్టు క్రికెట్ లో గంటకు సగటున 15 ఓవర్లు, వన్డేలలో 14.28 ఓవర్లు, టీ20లలో అయితే 14.11 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయాలి. వన్డేలలో ఒక జట్టు (బౌలింగ్ చేసే) మూడున్నర గంటలలో ఇన్నింగ్స్ ను పూర్తి చేయాలి. టీ20లలో ఇది ఒక గంటా 25 నిమిషాలే. ఈ టైమ్ ను దాటితే ఆయా జట్లు (టీమ్ కెప్టెన్) నిబంధనలు ఉల్లంఘించినట్టే లెక్క. దీనికి తొలిసారి అయితే జరిమానాలు, ఆ తర్వాత ఒక మ్యాచ్ నిషేధాలు కూడా ఉంటాయి.
ఐపీఎల్ లో అయితే..
- ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ ప్రకారం సీజన్ లో మొదటి తప్పిదానికి సదరు జట్టు సారథికి రూ. 12 లక్షల జరిమానా విధించబడుతుంది.
- రెండోసారి ఇదే కంటిన్యూ అయితే కెప్టెన్ కు రూ. 24 లక్షల జరిమానా , ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో రూ. 6 లక్షల లేదా 25 శాతం కోత విధించొచ్చు.
- ఒక సీజన్ లో మూడో సారి కూడా ఈ తప్పు రిపీట్ అయితే బౌలింగ్ చేసిన జట్టు కెప్టెన్ కు రూ. 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించబడుతుంది. టీమ్ లోని ఇతర సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 12 లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించొచ్చు.