
‘ఫినిషింగ్.. ఫినిషింగ్.. ఫినిషింగ్.. ఐ డోన్ట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్.. బట్ ఫినిషింగ్ లైక్స్ మి.. ఐ కాంట్ అవాయిడ్..’ గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ముగిసి హై ఓల్టేజీ మ్యాచ్ అనంతరం కేజీఎఫ్-2 లోని ఈ డైలాగ్ మీమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఈ మ్యాచ్ లో ఆఖరు బంతికి ఫోర్ కొట్టి సీఎస్కేకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ఆ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని. వయసు పెరుగుతున్నా తనలో ఫినిషర్ మాత్రం అలాగే ఉన్నాడని నిరూపిస్తూ సాగిన ధోని ఆటతీరుపై సోషల్ మీడియా హోరెత్తిపోతున్నది. ధోని ఆటపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూడా ప్రశంసలు కురిపించారు.
మ్యాచ్ అనంతరం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘వయసు అనేది ఒక అంకె మాత్రమే.. ధోని అసాధారణ ఫినిషర్. అతడొక ఛాంపియన్. లెజెండ్..’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఇక క్రికెట్ కుటుంబమైతే ధోనిని ఆకాశానికెత్తింది. ధోని మాజీ సహచర ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్ లతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, మైఖెల్ వాన్ లు ధోని ఫినిషింగ్ టచ్ కు మంత్రముగ్దులయ్యారు.
సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘ఓం ఫినిషాయా నమహా.. చాలా భాగుంది (రొంబ నల్ల అని తమిళ్ లో రాస్తూ).. అద్భుత విజయమది..’ అని రాసుకొచ్చాడు. కైఫ్ స్పందిస్తూ.. ‘ధోని ఆట అయిపోలేదు (ఫినిష్ నహీ). అతడు ఫినిషర్. పిక్చర్ అభీ బహుత్ బహుత్ బాకీ హై..’అని పేర్కొన్నాడు. రైనా స్పందిస్తూ.. ‘ఈ సీజన్ లో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన మ్యాచ్ కు గొప్ప ముగింపు. మహీ భాయ్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ .. చెన్నైకి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ (51 నాటౌట్) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (32) రాణించాడు. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), బ్రేవిస్ (4) దారుణంగా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో చెన్నై.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోని( 28 నాటౌట్) తో పాటు అంబటి రాయుడు (40), రాబిన్ ఊతప్ప (30) చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు.