
వెస్టిండీస్ టూర్లో భాగంగా ఫ్లోరిడాలో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కి చక్కగా అనుకూలించే పిచ్పై గత మ్యాచ్లో 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, గెలిచిన టీమిండియా... సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
మొదటి రెండు మ్యాచుల్లో వెస్టిండీస్ గెలవగా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చింది. సిరీస్ 2-2 డ్రా కావడంతో నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు, సిరీస్ సొంతం చేసుకుంటుంది.
గత 12 టీ20 సిరీస్లను సొంతం చేసుకున్న టీమిండియా, చివరిగా 2021లో శ్రీలంక టూర్లో టీ20 సిరీస్ కోల్పోయింది. అది కూడా కీ ప్లేయర్లు కరోనా బారినపడడంతో బీ టీమ్తో ఆడిన భారత జట్టు 2-1 తేడాతో ఓడింది. నేటి మ్యాచ్లో ఓడితే శిఖర్ ధావన్ తర్వాత టీ20 సిరీస్ ఓడిన కెప్టెన్గా చెత్త రికార్డు మూటకట్టుకుంటాడు హార్ధిక్ పాండ్యా..
గత మ్యాచ్లో శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్కి 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి పార్టనర్షిప్ కారణంగా 179 పరుగుల భారీ లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఛేదించింది భారత జట్టు. కుల్దీప్ యాదవ్ చక్కగా బౌలింగ్ చేసినా స్పిన్నర్లు యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్ భారీగా పరుగులు సమర్పించారు.
అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీసినా 38 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్ టూర్లో ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు స్వదేశానికి తిరిగి రాబోతున్నారు..
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఉన్న జట్టులో సంజూ శాంసన్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్, రవి భిష్ణోయ్, ముకేశ్ కుమార్లకు మాత్రమే ఐర్లాండ్ టూర్లో చోటు దక్కింది.
గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమైన వెస్టిండీస్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ అల్జెరీ జోసఫ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్కి వేదిక ఇవ్వబోతున్న వెస్టిండీస్కి ఈ మ్యాచ్ పరువు సమస్య ... మరో వైపు వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్కి కూడా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్పై సిరీస్ గెలవలేకపోయారనే అపవాదుని తొలగించుకోవాలంటే టీమిండియా నేటి మ్యాచ్లో ప్రతాపం చూపించి తీరాల్సిందే
వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోవ్మెన్ పావెల్ (కెప్టెన్), సిమ్రాన్ హెట్మయర్, జాసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్
భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ముకేశ్ కుమార్