
ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పొట్టి ఫార్మాట్లో తన సూపర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. విండీస్ టూర్లో మొదటి రెండు మ్యాచుల్లో విఫలమైన సూర్య, సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ప్రతాపం చూపించాడు. సూర్య భాయ్ ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్, తిలక్ వర్మ బాధ్యతాయుత కారణంగా మూడో టీ20లో ఘన విజయం అందుకుంది భారత జట్టు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో విండీస్ ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించగలిగింది.
160 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత జట్టుకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్, ఓబెడ్ మెక్కాయ్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్తో 6 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కలిసి మూడో వికెట్కి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్, 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్కి ఇది 14వ టీ20 హాఫ్ సెంచరీ..
51వ టీ20 మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, 49 ఇన్నింగ్స్ల్లో 17 సార్లు 50+ స్కోర్లు బాదాడు. అలాగే భారత జట్టు తరుపున అత్యంత వేంగా టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు సూర్య. రోహిత్ శర్మ 84 ఇన్నింగ్స్ల్లో 100 సిక్సర్లు బాదగా, విరాట్ కోహ్లీ 96 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు.
44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మరో టీ20 సెంచరీ చేసుకునేలా కనిపించాడు. అల్జెరీ జోసఫ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడిన సూర్య, బౌండరీ లైన్ దగ్గర బ్రెండన్ కింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ వన్సైడ్ అయిపోయింది.. 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా..
మొదటి రెండు టీ20ల్లో అదరగొట్టిన తిలక్ వర్మ, మూడో మ్యాచ్లోనూ మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా టాప్లో నిలిచాడు తిలక్ వర్మ. 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 49 పరుగులు చేసిన తిలక్ వర్మ, హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో నిలవగా 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 20 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా సిక్సర్తో మ్యాచ్ని ముగించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది. వెస్టిండీస్కి ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్ కలిసి తొలి వికెట్కి 55 పరుగుల భాగస్వామ్యం అందించారు. 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 25 పరుగులు చేసిన కైల్ మేయర్స్, అక్షర్ పటేల్ బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 12 పరుగులు చేసిన జాన్సన్ ఛార్లెస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 20 పరుగులు చేసిన నికోలస్ పూరన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు..
42 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 42 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న కుల్దీప్ యాదవ్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్గా నిలిచాడు.
8 బంతుల్లో ఓ ఫోర్తో 9 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్ని తన బౌలింగ్లో మొదటి బంతికే అవుట్ చేశాడు ముకేశ్ కుమార్. 19 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోవ్మెన్ పావెల్తో పాటు రొమారియో షెఫర్డ్ 5 బంతుల్లో 2 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు..