
డొమినికా టెస్టులో టీమిండియాకి శుభారంభం దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మొదటి 12 ఓవర్లలో వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేసిన విండీస్, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది..
క్రెగ్ బ్రాత్వైట్, టగెనరైన్ చంద్రపాల్ కలిసి ఆచితూచి ఆడుతూ భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశారు. 12.5 ఓవర్లలో తొలి వికెట్కి 31 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. 44 బంతుల్లో 12 పరుగులు చేసిన టగెనరైన్ చంద్రపాల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
2011లో శివ్నరైన్ చంద్రపాల్ని అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, 2023లో అతని కొడుకు టగెనరైన్ చంద్రపాల్ని అవుట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తండ్రీకొడుకులను అవుట్ చేసిన మొట్టమొదటి భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..
46 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్, అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 2 పరుగులు చేసిన రోమన్ రిఫర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
34 బంతుల్లో ఓ ఫోర్తో 14 పరుగులు చేసిన జెర్మైన్ బ్లాక్వుడ్, రవీంద్ర జడేజా బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ పట్టిన కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్కి అవుట్ అయ్యాడు.
ఓవరాల్గా టెస్టు క్రికెట్ చరిత్రలో తండ్రీకొడుకులను అవుట్ చేసిన ఐదో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. ఇంతకుముందు ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ ఇద్దరూ కూడా న్యూజిలాండ్ తండ్రీకొడుకులు లాన్స్ కెయిర్న్స్, క్రిస్ కెయిర్న్స్లను అవుట్ చేయగా మిచెల్ స్టార్క్, సిమాన్ హర్మన్ ఇద్దరూ కూడా శివ్నరైన్ చంద్రపాల్తో పాటు టగెనరైన్ చంద్రపాల్లను అవుట్ చేశారు.
టెస్టుల్లో అత్యధిక మందిని క్లీన్ బౌల్డ్ చేసిన భారత బౌలర్గానూ రవిచంద్రన్ అశ్విన్, సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుమందు అనిల్ కుంబ్లే టెస్టుల్లో 94 మంది బ్యాటర్లను బౌల్డ్ చేయగా చిన్న చంద్రపాల్ వికెట్, రవిచంద్రన్ అశ్విన్ కెరీర్లో 95వ బౌల్డ్. కపిల్ దేవ్ 88, మహ్మద్ షమీ 66 మందిని బౌల్డ్ చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు..