
భారత్ లో సినీ తారలను గానీ రాజకీయ నాయకులను గానీ క్రికెటర్లను గానీ అభిమానిస్తే దానికి హద్దులు ఉండవు. సదరు అభిమాన నటుడు, నాయకుడు, ఆటగాడిపై ఇంతే ప్రేమ చూపించాలి.. అతడు పబ్లిక్ ఫంక్షన్లకు వస్తే అరవకూడదు.. డీసెంట్ గా ఉండాలి... ఇలాంటివన్నీ జాన్తానై. తాము అభిమానించే వాళ్ల కోసం ఎంత రిస్క్ అయినా తగ్గేదేలే. ఇక క్రికెట్ లో అయితే అది వేరే లెవల్. ఒకప్పుడు క్రీజులో సచిన్ బ్యాటింగ్, పీల్డింగ్ చేస్తుండగా ఆ క్రికెట్ దేవుడిని ఒక్కసారైనా దగ్గరగా చూడాలని.. ఒకసారి ముట్టుకోవాలని.. ఆయన కన్ను మన మీద పడితే చాలని పరితపించిపోయి.. భారీ ఫెన్షింగులు దాటి గ్రౌండ్ లోకి అడుగుపెట్టినవారెందరో.. పోలీసులు దెబ్బలు కొట్టినా సరే.. సచిన్ ను చూశామన్న తృప్తితో ఇంటికెళ్లినవాళ్లు ఎంతోమంది. ఇప్పుడు చిన్న ఛేంజ్.. సచిన్ స్థానం విరాట్ కోహ్లిది.
చిన్నా పెద్దా తేడా లేకుండా అభిమానులను సంపాదించుకున్న కోహ్లి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటిది తమ అభిమాన క్రికెటర్ ను గ్రౌండ్ లో ప్రత్యక్షంగా చూశాక సదరు అభిమానుల ఫీలింగ్ ఎలా ఉంటుంది..? ఆయనను ఒక్కసారి కలవాలని.. కుదిరితే ఒక సెల్ఫీ తీసుకోవాలని ఉండదు. బెంగళూరు టెస్టులో ఓ ముగ్గురు ఫ్యాన్స్ కు కూడా అదే అనిపించింది.
బెంగళూరు టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా.. లంక రెండో ఇన్నింగ్స్ కు వచ్చింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో షమీ వేసిన బంతి లంక సారథి కరుణరత్నెకు బలంగా తాకింది. దీంతో లంక ఫిజియోలు వచ్చి.. అతడికి పెయిన్ రిలీఫ్ బామ్ ను అప్లై చేస్తున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్ కాసేపు ఆగింది. ఇదే అదును అనుకున్నారు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ముగ్గురు కోహ్లి అభిమానులు. కోహ్లి దగ్గరికి వెళ్లాలనే ఆలోచన వచ్చిందే తడువుగా.. కోహ్లికి తమకు అడ్డుగా ఉన్న భారీ ఫెన్షింగ్ ను దాటారు. నేరుగా స్లిప్స్ లో ఉన్న విరాట్ దగ్గరకు వెళ్లి.. సెల్ఫీ అడిగారు. వారి కోరికను కోహ్లి మన్నించాడు.
అయితే ఈ హఠత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది వారిని పట్టుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. కోహ్లితో సెల్ఫీ తీసుకున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా మరొక వ్యక్తి మాత్రం పోలీసులను పరుగులు పెట్టించాడు. గ్రౌండ్ అంతా తిరుగుతూ నానా యాగీ చేశాడు. ఆఖరికి పోలీసులంతా చుట్టుముట్టడంతో దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా బెంగళూరు లో అయినా సెంచరీ చేస్తాడని భావించిన అభిమానుల ఆశలపై కోహ్లి మరోసారి నీళ్లు చల్లాడు. తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 13 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి హాఫ్ సెంచరీ కూడా చేయలేక తన అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు.