IND Vs SA: కేప్ టౌన్ టెస్టుకు కెప్టెన్ రెడీ.. హనుమా విహారి మళ్లీ బెంచ్ కే పరిమితమా..? పంత్ కూ ప్లేస్ డౌటే..!

By Srinivas MFirst Published Jan 7, 2022, 5:47 PM IST
Highlights

Hanuma Vihari To be Dropped: ఈనెల 11 నుంచి కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు మూడో టెస్టు ఆడనున్నది. ఈ మ్యాచుకు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో... 

టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడు టెస్టెు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే రెండు జట్లు తలో విజయాన్ని అందుకున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరిదైన మూడో టెస్టు.. ఈ నెల 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరుగనున్నది. రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ భారత  టెస్టు సారథి విరాట్ కోహ్లి.. కేప్ టౌన్ టెస్టులో  ఆడతాడని ఊహాగానాలు వినపడుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలు కూడా  ఇందుకు ఊతమిస్తున్నాయి. విరాట్ కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమా విహారికి మరోసారి నిరాశే ఎదురుకానుంది. కోహ్లి తిరిగివస్తే విహారి మళ్లీ బెంచ్ కే పరిమితమవుతాడు. 

రాక రాక వచ్చిన అవకాశాన్ని విహారి చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.  రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్పులో మాత్రం 84 బంతుల్లో 40 పరుగులు చేసి భారత్ విలువైన ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత చేసినా అతడికి ఎప్పటి మాదిరే టీమిండియా యాజమాన్యం మొండి చేయి చూపించనుంది. 

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా విహారిపై టీమ్ మేనేజ్మెంట్ ఇలాగే వ్యవహరించింది.  దీనిపై ఆకాశ్ చోప్రా, గౌతం గంభీర్ వంటి క్రికెటర్లు బహిరంగంగానే బీసీసీఐ విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా  మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతుండటం గమనార్హం. 

విహారి విషయం పక్కనపెడితే.. రెండో టెస్టులో టీమిండియాను కలవరపెట్టిన మరో  అంశం రిషభ్ పంత్ ఫామ్. మిడిలార్డర్ లో కీలకంగా ఆడాల్సిన బాధ్యత తన  మీద ఉన్న పంత్ మాత్రం చెత్త షాట్లతో వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ సిరీస్ లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు.  వరుసగా రెండు టెస్టులు, నాలుగు ఇన్నింగ్సులలో కలిపి రెండంకెల స్కోరు కూడా దాటలేదు. ఇక రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో ఉండగా.. రిషభ్ మాత్రం క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడటంపై గవాస్కర్, గంభీర్ వంటి సీనియర్ ఆటగాళ్లు  అతడిపై పదునైన విమర్శలు చేశారు. 

ఈ నేపథ్యంలో  కేప్ టౌన్ టెస్టులో అతడిని తప్పించి వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కు ఛాన్స్ ఇవ్వాలని వాదనలు వినిపించాయి. ఇక ఈ విషయంపై   రాహుల్ ద్రావిడ్, సారథి విరాట్ కోహ్లి కూడా ఇదే అభిప్రాయంతోని ఉన్నారని సమాచారం. ఇక రెండో టెస్టులో గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా కేప్ టౌన్ లో ఆడేది అనుమానమే అని తెలుస్తున్నది. అతడు వంద శాతం ఫిట్ గా లేడన్నది ద్రావిడ్ మాట. ఒకవేళ మూడో టెస్టు సమయానికి అతడు ఫిట్ గా లేకుంటే  ఉమేశ్ యాదవ్ గానీ, ఇషాంత్ శర్మ గానీ ఆ మ్యాచ్ ఆడే అవకాశముంది. 

మూడో టెస్టుకు భారత జట్టు అంచనా : కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్/వృద్ధిమాన్ సాహా,రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ ఇషాంత్ శర్మ /ఉమేశ్ యాదవ్  

click me!