IND vs ENG : బుమ్రాకు విశ్రాంతి.. తిరిగొచ్చిన కేఎల్ రాహుల్.. !

By Mahesh RajamoniFirst Published Feb 20, 2024, 9:41 AM IST
Highlights

KL Rahul - Jasprit Bumrah : భారత్ vs ఇంగ్లాండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో వుంది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే రాంచీ టెస్టులో  స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ తిరిగి జ‌ట్టులోకి రానున్నాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి. 
 

KL Rahul - Jasprit Bumrah : టీమిండియాకు గుడ్ న్యూస్ తో పాటు మ‌రో బ్యాడ్ నూస్ కూడా.. !  స్టార్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా తన పనిభారాన్ని నిర్వహించడానికి టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5-మ్యాచ్‌ల సిరీస్‌లో 4వ‌ టెస్ట్‌కు విశ్రాంతి తీసుకునే అవకాశముంది. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లిన త‌ర్వాత టీమిండియా ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుతో కలిసి రాజ్‌కోట్ నుండి రాంచీకి వెళ్లడం లేదని బీసీసీఐ సంబంధిత వ‌ర్గాలు తెలిపిన‌ట్టు మీడియా వ‌ర్గాలు పేర్కొన్నాయి. రోహిత్ శర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా, ఇత‌ర సిబ్బంది మంగళవారం రాంచీకి చేరుకోనుంది.

జ‌ట్టులోకి కేఎల్ రాహుల్.. ! 

మరోవైపు, ఫిబ్రవరి 23న జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభమయ్యే భార‌త్-ఇంగ్లాండ్ 4ద టెస్ట్‌లో కేఎల్ రాహుల్ ఆడ‌నున్నాడ‌ని స‌మాచారం. క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్ కారణంగా రాహుల్ రెండో, మూడో టెస్టులకు దూరమయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో మెరిసిన ఈ స్టార్ బ్యాటర్ చివరి మూడు టెస్టుల జట్టులో చోటు దక్కించుకున్నాడు, అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో చివ‌రి నిమిషంలో రాజ్‌కోట్ టెస్టుకు దూరమయ్యాడు. భారత క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో కేఎల్ రాహుల్ గురించి వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. రాహుల్ 90 శాతం ఫిట్‌గా ఉన్నాడనీ, స్టార్ బ్యాటర్ క్వాడ్రిస్ప్స్ సమస్య నుండి పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలిపింది. 434 పరుగులతో భారత్ విజయం సాధించిన తర్వాత రాజ్‌కోట్‌లో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ..  కేఎల్ రాహుల్ గాయం నుండి కోలుకోవడంపై సానుకూల సూచ‌న‌లు చేశాడు. 

బుమ్రాకు విశ్రాంతి

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వైజాగ్‌లో 9 వికెట్లు, హైదరాబాద్‌లో 6 వికెట్లు తీశాడు. రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జ‌రిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో ఒక్కో వికెట్ తీశాడు. బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్ లేదా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌కు చోటుద‌క్క‌వ‌చ్చు. రాంచీలో పరిస్థితులు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే, నలుగురు స్పిన్నర్లను ఆడించే ఆలోచనతో జట్టు మేనేజ్‌మెంట్ ముందుకు సాగ‌వ‌చ్చు.

YASHASVI JAISWAL: టీమిండియాకు మరో కొత్త సెహ్వాగ్.. !

 

click me!