IND vs AUS T20I: ఇంకా సిద్ధం కాని నాగ్‌పూర్.. ఐదు ఓవర్ల మ్యాచేనా..?

By Srinivas MFirst Published Sep 23, 2022, 8:29 PM IST
Highlights

IND vs AUS T20I Live: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  నాగ్‌పూర్ వేదికగా జరగాల్సి ఉన్న రెండో టీ20 జరిగేది అనుమానమే. అంపైర్ల మాటలను బట్టి చూస్తే ఇదే అనుమానం కలుగుతున్నది. 

మొహాలీలో ఓడినా నాగ్‌పూర్ లో ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకుందామని చూస్తున్న టీమిండియా ఆశలు అడియాసలే అయ్యేలా ఉన్నాయి. నాగ్‌పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో  జరగాల్సి ఉన్న రెండో టీ20  గత రెండ్రోజులుగా కురిసిన వర్షంతో దాదాపు రద్దయ్యే (?) స్థితికి చేరుకుంది. 

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం  6.30 గంటలకు టాస్ పడాల్సి ఉండగా అంపైర్లు దానిని 7 గంటలకు వాయిదా వేశారు. ఏడింటికి  అంపైర్లు వచ్చి గ్రౌండ్ ను పరిశీలించి అవుట్ ఫీల్డ్ ఇంకా  తడిగానే ఉండటంతో  టాస్ ను 8 గంటలకు వాయిదా వేశారు. 8 గంటలకు మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చి చూసిన అంపైర్లు.. టాస్ ను రాత్రి 8.45 గంటలకు వాయిదా వేశారు. అయితే అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది. 

గ్రౌండ్ లో అంపైర్లతో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మురళీ కార్తీక్.. గ్రౌండ్ పరిస్థితి, మ్యాచ్ గురించి అడిగాడు. దానికి అంపైర్లు మాట్లాడుతూ.. ‘ఈరోజు వర్షమేమీ లేదు. అంతా బాగానే ఉంది. గ్రౌండ్ లో అవుట్ ఫీల్డ్ పైకి డ్రైగా కనిపిస్తున్నా లోపల మెత్తదనం అలాగే ఉంది. అది ఆటగాళ్లకు ఫీల్డింగ్ చేసేప్పుడు ఇబ్బందికరంగా మారుతుందనేదే మా ఆందోళన.. వారిని దృష్టిలో ఉంచుకునే  మేమింకా వేచి చూసే ధోరణిలో ఉన్నాం. 8.45 గంటలకు మరోసారి రివ్యూ చేసి అప్పుడు ఏ విషయమనేది చెప్తాం..’ అని తెలిపారు. 

అయితే ఒకవేళ అప్పటికీ మ్యాచ్ జరిగితే ఐదు ఓవర్లు లేదంటే 8 ఓవర్ల మ్యాచ్ అవుతుందా..? అని కార్తీక్ ప్రశ్నించగా.. మ్యాచ్ నిర్వహణకు తమకు రాత్రి 9.46 గంటలకు వరకు సమయముందని  మళ్లీ రివ్యూకు వచ్చేప్పుడు ఏ విషయమనేది చెబుతామని వెళ్లిపోయారు. 

 

Listen in to what the umpires have to say about the possibility of play today. pic.twitter.com/wznhbQfmID

— BCCI (@BCCI)

అంపైర్లు చెప్పినదానిని బట్టి చూస్తే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగ్‌పూర్ లో గత రెండ్రోజులు  భారీ వర్షలు కురిశాయి. నిన్నటిదాకా ఈ గ్రౌండ్ చెరువును తలపించిందని కామెంట్రీ బాక్స్ లో ఉన్న రవిశాస్త్రి చెబుతున్నాడు. అయితే ఇవాళ వర్షం తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న నిర్వాహకులు.. హడావిడిగా దానిని సిద్ధం చేయడానికి యత్నిస్తున్నారు. కానీ పైన తడి  లేకున్నా ఇసుక లోపల   ఆ తడి ఇంకా ఆరలేదని.. అది ఆటగాళ్లకు ఫీల్డింగ్ చేసే సమయంలో  ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ను జరపకుండా ఆపేస్తేనే బెటరని ఆయన అభిప్రాయపడుతున్నాడు.  

మరోవైపు నాగ్‌పూర్ గ్రౌండ్ నిర్వాహకులపై ట్విటర్ వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రౌండ్ లో నీటిన డ్రైనేజ్ సిస్టమ్ లేదా..? అని విదర్భ క్రికెట్ అసోసియేషన్ తో పాటు బీసీసీఐ పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!