అజింకా రహానే కూడా అవుట్! శార్దూల్ ఠాకూర్ డక్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి అంచున టీమిండియా..

Published : Jun 11, 2023, 04:37 PM IST
అజింకా రహానే కూడా అవుట్! శార్దూల్ ఠాకూర్ డక్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి అంచున టీమిండియా..

సారాంశం

WTC final 2023: 46 పరుగులు చేసి అవుటైన అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ డకౌట్... 213 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఆశలు ఆవిరైపోయాయి. చివరి రోజు 280 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, మొదటి సెషన్‌ మొదలైన గంటన్నరలోనే 4 కీలక వికెట్లు కోల్పోయింది..  భారత బ్యాటింగ్‌లో కీలకమైన విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఏడో వికెట్ కోల్పోయే సమయానికి విజయానికి 232 పరుగుల దూరంలో ఉంది.

యంగ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌తో పాటు టెయిలెండర్లు మాత్రమే మిగిలి ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయినట్టే. ఓవర్‌నైట్ స్కోర్ 164/3 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 13 పరుగులు మాత్రమే జోడించి విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది..ఆ వెంటనే రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు. 

78 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 179 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, రెండో బంతికే అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసిన స్కాట్ బోలాండ్, టీమిండియా అభిమానుల ఆశలపై నీళ్లు పోశాడు.   అవుట్ అవ్వడానికి ఒక్క బంతి ముందు విరాట్ కోహ్లీ అవుట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకుంది ఆస్ట్రేలియా. టీవీ రిప్లై బంతికీ, బ్యాటుకీ చాలా గ్యాప్ ఉండడంతో కోహ్లీ నాటౌట్‌గా తేలాడు. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు.. 

శ్రీకర్ భరత్, అజింకా రహానే కలిసి ఆరో వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 108 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేసిన అజింకా రహానే, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 5 బంతులు ఆడి నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

అంతకుముందు 444 పరుగుల భారీ టార్గెట్‌తో నాలుగో రోజు రెండో సెషన్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, శుబ్‌మన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయింది. 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లోనే కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే క్యాచ్ పట్టిన తర్వాత కామెరూన్ గ్రీన్ చేతిలోని బంతి, నేలను తాకినట్టు క్లియర్‌గా కనిపించింది.

అయినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 27 పరుగులు చేసి అనవసర షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 93 పరుగులుకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే