
మహిళల ప్రపంచకప్ లో భారత్ జోరుకు ఇంగ్లాండ్ బ్రేకులు వేసింది. తొలుత బ్యాటింగ్ లో భారత బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైనా తర్వాత బౌలింగ్ లో మాత్రం అదరగొట్టింది. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ టీమిండియా పై ఒత్తిడి పెంచింది. భాగస్వామ్యాలను విడదీస్తూ భారత్ ను దెబ్బకొట్టింది. భారత జట్టులో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52, 7 ఫోర్లు, 1 సిక్సర్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచి టోర్నీలో తొలి ఓటమిని మూటగట్టుకుంది. 151 పరుగుల లక్ష్య ఛేదనలో 140 (140-5) పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ నేరుగా సెమీస్ కు అర్హత సాధించింది. భారత్ ఈనెల 20న ఐర్లాండ్ తో తలపడనుంది.
మోస్తారు లక్ష్య ఛేదనలో భారత్ కూడా ఇంగ్లాండ్ మాదిరిగానే తడబడింది. 11 బంతులాడిన ఓపెనర్ షఫాలీ వర్మ 8 పరుగులే చేసి లారెన్ బెల్ బౌలింగ్ లో క్యాథరీన్ సీవర్ కు క్యాచ్ ఇచ్చింది. వన్ డౌన్ లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (13), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (4) కూడా విఫలమయ్యారు.
నిలిచిన స్మృతి..
ఛేదించాల్సిన లక్ష్యం మరీ పెద్దదేం కాకున్నా సహచర బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టడంతో స్మృతి మంధాన బాధ్యతను భుజాన వేసుకుంది. క్యాథరీన్ వేసిన భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదింది. ఆ తర్వాత వికెట్లు టపటపా రాలడంతో కాస్త నెమ్మదించింది. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 64-3గా ఉంది.
హర్మన్ప్రీత్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిచా ఘోష్ తో కలిసి నాలుగో వికెట్ కు మంధాన 43 పరుగులు జోడించింది. రిచా.. నటాలి వేసిన 12వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదింది. ఛార్లెట్ డీన్ వేసిన తర్వాతి ఓవర్లో మంధాన కూడా రెండు బౌండరీలు కొట్టింది. 15 ఓవర్లు ముగిసేసిరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. అప్పటికీ ఇంకా భారత్ విజయానికి 30 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది. 16వ ఓవర్లో ఐదో బంతికి సిక్సర్ బాదిన స్మృతి హాప్ సెంచరీ పూర్తి చేసుకుంది. కానీ తర్వాతి బంతికే ఆమె భారీ షాట్ ఆడబోయి నటాలీకి క్యాచ్ ఇచ్చింది.
మంధాన ఔట్ అయ్యాక 17 వ ఓవర్లో భారత్ కు నాలుగు పరుగులే వచ్చాయి. 18వ ఓవర్లో రిచా సిక్సర్ కొట్టినా బెల్ ఆ ఓవర్లో మిగిలిన ఐదు బంతులకు మూడు పరుగులే ఇచ్చింది. చివరి రెండు ఓవర్లలో భారత్ కు 34 పరుగులు అవసరం పడ్డాయి. కానీ 19వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. క్యాథరీన్ సీవర్ వేసిన చివరి ఓవర్లో రిచా.. తొలి రెండు బంతులకు ఫోర్ కొట్టింది. నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదింది. ఐదో బాల్ కు రెండు పరుగులే రాగా ఆరో బంతికి పరుగులు రాలేదు. ఫలితంగా భారత్.. 140 పరుగుల వద్దే ఆగిపోయింది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆ జట్టులో సీవర్ (50) హాఫ్ సెంచరీతో మెరవగా వికెట్ కీపర్ అమీ జోన్స్ (40) చివర్లో ధాటిగా ఆడింది. రేణుకా సింగ్ ఠాకూర్ కు ఐదు వికెట్లు దక్కాయి.