
టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తిరిగి టెస్టుల్లో తన అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో కోహ్లీ నెంబర్ వన్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు.
నిన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్..ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి చేరుకున్నాడు.
Also Read:అలా జరుగుతూ ఉంటాయి... పాక్ జట్టుపైషోయబ్ కామెంట్
ఇదే సమయంలో దక్షిణాఫ్రికాతో డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్తో జరిగిన డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ చేసిన విరాట్ 928 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. భారత ఆటగాళ్లలో ఛటేశ్వర్ పుజారా తన నాలుగో స్థానాన్ని పదిలం చేసుకోగా.. అజింక్య రహానె ఒక స్థానం తగ్గి ఆరో ర్యాంకును అందుకున్నాడు.
పాకిస్తాన్పై ట్రిపుల్ సెంచరీ బాదిన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా 12 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. వరుస శతకాలు బాదిన మార్నస్ లబుషేన్ కెరీర్లో తొలిసారిగా టాప్-10 జాబితాలోకి అడుగుపెట్టాడు. ఇక బౌలర్ల జాబితాలో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐదో స్థానంలో, స్పిన్నర్ అశ్విన్ తొమ్మిదో ర్యాంకులో నిలిచారు.
కాగా బాల్ టాంపరింగ్ ఉదంతం అనంతరం నిషేధానికి గురై ఇంగ్లాండ్తో జరిగిన యాషెస్ సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చిన స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు టెస్టుల సిరీస్లో ఏకంగా 774 పరుగులు రాబట్టి తన సత్తా ఏంటో చూపించడమే కాకుండా అప్పటి వరకు నెంబర్వన్ ప్లేస్లో ఉన్న విరాట్ కోహ్లీని పక్కకు నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Also read:ఫిట్నెస్ పక్కన పెట్టి.. బర్గర్, చాక్లెట్ షేక్ లాగించిన కోహ్లీ.. కారణం ఇదే
అయితే పాక్తో సిరీస్లో దారుణంగా విఫలమవ్వడంతో తన ర్యాంకును కోల్పోయాడు. అయితే ఈ నెల 12 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో రాణిస్తే స్మిత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.