
ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు ఐసీసీ నిర్వహిస్తున్న క్వాలిఫయింగ్ రౌండ్ లో సూపర్ సిక్సెస్ దశకు చేరుకున్న జట్లు ఏవో తేలిపోయింది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఈ పోటీలలో మాజీ ఛాంపియన్ శ్రీలంక లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో సూపర్ సిక్స్ కు అర్హత సాధించింది. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో గెలవడం ద్వారా లంక సూపర్ సిక్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
ఆదివారం బులవాయో వేదికగా జరిగిన లంక - ఐర్లాండ్ మ్యాచ్ తో పాటు స్కాట్లాండ్ - ఓమన్ మధ్య మ్యాచ్ జరిగింది. స్కాట్లాండ్ కూడా ఓమన్ ను ఓడించడంతో ఆ జట్టు గ్రూప్ - బిలో శ్రీలంక తర్వాతి స్థానంలో సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది.
గ్రూపుల వారీగా సూపర్ సిక్స్ కు చేరిన జట్లు :
గ్రూప్ -ఎ : జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్
గ్రూప్ - బి : శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్
ఎలిమినేట్ అయిన జట్లు :
గ్రూప్ - ఎ : నేపాల్, యూఎస్ఎ
గ్రూప్ - బి : ఐర్లాండ్, యూఏఈ
గ్రూప్ - ఎలో వెస్టిండీస్, నెదర్లాండ్స్, జింబాబ్వే - యూఎస్ఎ మధ్య నేడు చివరి లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ లో నెగ్గితేనే వెస్టిండీస్ కు వన్డే వరల్డ్ కప్ లో అర్హత సాధించే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు జింబాబ్వే కూడా.. ఈ మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలని భావిస్తున్నది.
గ్రూప్ -బిలో రేపు (జూన్ 27) శ్రీలంక - స్కాట్లాండ్ (ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్ గా ఉండనుంది.) మధ్య మ్యాచ్ తో పాటు ఐర్లాండ్, యూఏఈ మధ్య నామమాత్రపు పోరు జరుగనుంది.
జూన్ 29 నుంచి అసలు సమరం మొదలుకానుంది. సూపర్ సిక్స్ లో ఒక్కో జట్టు ఇతర గ్రూపులోని జట్లతో మ్యాచ్ లు ఆడనుంది. ఈ దశలో కూడా టీమ్స్ మూడేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సూపర్ సిక్స్ ముగిసేసరికి టాప్-2లో ఉన్న జట్లు అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఇదివరకే క్వాలిఫై అయిన 8 జట్లతో కలుస్తాయి. మరి ఆ రెండు జట్లు ఏమవుతాయో తేలాలంటే జులై 7 దాకా వేచి చూడాల్సిందే.