
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవహరించి ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్న డేవిడ్ వార్నర్ కు అతడి భార్య క్యాండీస్ వార్నర్ స్పెషలాఫర్ ఇచ్చింది. ఇంటికొచ్చాక చాలా పనుందని, అదంతా వార్నర్ తో చేయిస్తానని వార్నర్ భాయ్ కు ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. పాకిస్థాన్ తో రెండో టెస్టు సందర్భంగా కరాచీ పిచ్ మీద సుత్తెతో పని చేస్తున్న వార్నర్ భాయ్ వీడియోను చూసిన తర్వాత క్యాండీస్ పై విధంగా స్పందించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కరాచీ టెస్టులో పాక్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 155వ ఓవర్లో లియాన్ బౌలింగ్ చేస్తుండగా పిచ్ సరిగా లేదని అతడు అంపైర్ కు చెప్పాడు. లియాన్ బౌల్ వేయడానికి ల్యాండ్ అయ్యే ప్రాంతంలో కింద భూమి కొంత ఎగుడుదిగుడుగా ఉంది. దీంతో అంపైర్ గ్రౌండ్ మెన్ ను పిలిచి దానిని సరిచేయాల్సిందిగా సూచించాడు.
అయితే అక్కడే ఉన్న వార్నర్.. సుత్తె అందుకుని పిచ్ ను సరిచేశాడు. పాక్ ఇన్నింగ్స్ 155వ ఓవర్ లో బాబర్ ఆజమ్, రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
కాగా ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ క్యాండీస్ వార్నర్ స్పందించింది. ‘మన ఇంట్లో కూడా ఇలాంటి పని చేయాలని కోరుకుంటున్నా వార్నర్..’ అని రాసుకొచ్చింది. ఈ వీడియో తో పాటు క్యాండీస్ కామెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన పలువురు సన్ రైజర్స్ అభిమానులు.. ‘అయ్యో వదిన.. మా వార్నర్ భాయ్ తో అంత పని చేయించొద్దు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది.. ‘అతడు చాలా హార్డ్ వర్కర్.. ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకోనివ్వండి..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఆట నాలుగో రోజు ఆసీస్ సారథి కమిన్స్ కూడా సుత్తెతో పిచ్ ను సరిచేసిన వీడియో కూడా వైరలైన విషయం తెలిసిందే. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చేతికి బంతినిచ్చాడు కమిన్స్. 53వ ఓవర్ వేసిన గ్రీన్.. బంతిని వేసేప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడు బంతిని విసిరే సమయంలో ల్యాండ్ అవుతుండగా పిచ్ సరిగా లేదని గమనించాడు. దీంతో గ్రీన్ ఈ విషయాన్ని కమిన్స్ కు చెప్పాడు. కమిన్స్ ఈ విషయాన్ని అంపైర్లకు సూచించగా.. అక్కడికి ఓ గ్రౌండ్ మెన్ సుత్తెతో వచ్చాడు. అయితే అతడి దగ్గర్నుంచి సుత్తె తీసుకున్న కమిన్స్.. ఎగుడుదిగుడుగా ఉన్న ఏరియాను సరిచేశాడు. సుత్తె అందుకుని పిచ్ పై బాదుతూ మట్టిని తొలగించాడు.