
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరో అరుదైన ఘనత సాధించాడు. యువరాజ్ సింగ్ వన్డేలలో తొలిసారి సెంచరీ చేసిన బ్యాట్.. అంతరిక్షంలోకి వెళ్లింది. ఆసియాకు చెందిన ఓ నాన్ ఫంజిబుల్ టోకెన్ (NFT) సంస్థ.. ఈ బ్యాట్ ను విశ్వాంతరాలకు పంపించింది. ఈ మేరకు సదరు సంస్థ ఇందుకు సంబంధించిన వీడియోను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇదే విషయమై యువరాజ్ స్పందిస్తూ.. ‘నా బ్యాట్ అంతరిక్ష ప్రయాణం చేసినందుకు నేను ఎంతో థ్రిల్ అవుతున్నాను..’ అని చెప్పాడు. అంతేగాక ఈ ప్లాట్ఫాం (ఎన్ఎఫ్టీ) లో చేరడం వల్ల తన అభిమానులతో అనుబంధం మరింత పెరుగుతుందని అన్నాడు. ఈ బ్యాట్ తోనే తాను తొలి సెంచరీ నమోదు చేశానని చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉండగా.. భారత క్రికెట్ లో దినేశ్ కార్తీక్ తర్వాత ఎన్ఎఫ్టీ లో ఈ ఘనతను సాధించిన రెండో క్రికెటర్ గా యువీ రికార్డులకెక్కాడు. గతంలో దినేశ్ కార్తీక్.. బంగ్లాదేశ్ పై నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ లో భాగంగా 2018 మార్చిలో జరిగిన మ్యాచ్ లో 8 బంతుల్లో 29 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆఖరు బంతికి సిక్సర్ కొట్టిన కార్తీక్.. ఆ ఫ్లాట్ సిక్సర్ ను ఎన్ఎఫ్టీ రూపంలో లిఖించుకున్నాడు. భారత్ ను గెలిపించాక కార్తీక్ సెలబ్రేట్ చేసుకున్న విజయ క్షణాలు, అందుకు సంబంధించి అతడిలోని ఆలోచనలు, భావోద్వేగాలు ఎన్ఎఫ్టీ గా రానున్నాయి. కార్తీక్ భావోద్వేగాలను కలబోసిన NFT యానిమేషన్ రూపంలో పొందుపరిచారు.
NFT అంటే..?
ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ. డబ్బ విలువ మారకం తగ్గింది. అంతా ఆన్లైన్ వేదికలుగానే వర్తక, వ్యాపారాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కాయిన్స్, బిట్ కాయిన్, డిగో కాయిన్ వంటివి మార్కెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. రేపటి భవిష్యత్ అంతా వీటిదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇవి ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఎదుగుతున్నాయి. ఇదే క్రమంలో సెలబ్రిటీలు, ప్రముఖులకు సంబంధించిన మాటలు, పాటలు, నటన, ఇతరత్రా విషయాలకు సంబంధించిన విషయాలను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చుతారు. వీటిని బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఆన్లైన్ లో వేలం వేస్తారు. ఇదొక ఆర్ట్ వర్క్ వంటిది. యానిమేషన్ సాయంతో వీటిని తయారు చేస్తారు. వీటిని Non Fungible Tokensగా వ్యవహరిస్తారు.
క్రిప్టో కరెన్సీ మాదిరిగానే ఈ ఎన్ఎఫ్టీ లు భద్రంగా ఉంటాయి. ప్రముఖులకు సంబంధించిన ఈ డిజిటల్ ఆస్తులు.. వాటిని దక్కించుకున్న వారికే చెందుతాయి. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా పిలుస్తారు. అంతేగాక ఈ టోకెన్లతో క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేసుకునే వీలుంటుంది.
బంగ్లాపై అద్భుత సెంచరీ..
కాగా.. 2003లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో యువరాజ్ సింగ్ ఈ ఫార్మాట్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ చైర్మెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు.. ఢాకాలో ఆడిన వన్డే మ్యాచ్ లో యువరాజ్ తన తొలి సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అర్థ సెంచరీ చేయగా.. యువీ తొలి సెంచరీ బాదాడు.
ఆ మ్యాచ్ లో 27వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన యువీ.. ప్రారంభం నుంచి ధాటిగా ఆడాడు. కేవలం 85 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత భారత జట్టు.. బంగ్లాదేశ్ ను 76 పరుగులకే ఆలౌట్ చేసింది. జహీర్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు.