IPL2021: డ్రీమ్11 వ్యవస్థాపకులపై ఎఫ్ఐఆర్.. కర్నాటకలో ఆ సంస్థ అక్రమాలు చేస్తున్నదంటూ కేసులు

By team teluguFirst Published Oct 11, 2021, 1:24 PM IST
Highlights

FIR On Dream11: ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11 వ్యవస్థాపకులకు షాక్ తగిలింది. ఆ సంస్థ ఫౌండర్స్ పై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. 

చివరిదశకు చేరుకున్న ఐపీఎల్ లో మరో మూడు మ్యాచ్ లైతే ప్రస్తుత సీజన్ కు తెరపడనుంది. ఈ క్రమంలో IPL2021 కు ప్రధాన Sponserగా ఉన్న Dream 11 Founders పై కేసు నమోదవడం కలకలం రేపింది. కర్నాటక వేదికగా ఆ సంస్థ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులు డ్రీమ్ 11 వ్యవస్థాపకులైన హర్ష జైన్, భవిత్ షేత్ లపై కేసు నమోదు చేశారు. 

ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. ముంబై బేస్డ్ కంపెనీ అయిన డ్రీమ్ 11.. దక్షిణాది రాష్ట్రం karnatakaలో కూడా కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. అయితే కర్నాటకలో ఇటీవల తీసుకొచ్చిన  క్రీడల చట్టాన్ని డ్రీమ్ 11 ఉల్లంఘించిందని ఆరోపణలు నమోదయ్యాయి. 

కర్నాటకలో Online game apps, ఆన్లైన్ గేమింగ్ పై అక్టోబర్ 5 నుంచి నిషేధం విధించారు. అప్పట్నుంచి మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL), పేటీఎం ఫస్ట్ గేమ్స్, గేమ్స్ 24*7, రమ్మీ సర్కిల్ వంటి యాప్ లు కర్నాటకలో తమ కార్యకలాపాలను నిలిపేశాయి. కానీ డ్రీమ్ 11 మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్స్ ను కొనసాగించింది. దీంతో ఆ సంస్థ నిర్వాహకులపై బెంగళూరు పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

కాగా.. దీనిపై డ్రీమ్ 11  ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా వినియోగదారుల ఆందోళనలను నివృత్తం చేయడం  మా బాధ్యత. మేము కర్నాటకలో మా కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించుకున్నాము. రాష్ట్రంలోని కొత్త చట్టం మేరకు మేము వ్యవహరిస్తాం’ అని తెలిపాడు. కాగా, డ్రీమ్ 11 పై పెట్టుబడులు పెట్టిన కర్నాటక వినియోగదారులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

2020 వ ఆర్థిక సంవత్సరంలో డ్రీమ్ 11 ఐపీఎల్ ద్వారా సుమారు రూ. 180 కోట్ల  ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలుస్తున్నది. గతేడాదితో పోల్చితే ఈ సంస్థ ఆదాయం ఈ ఏడాది  రెండున్నర రెట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 

click me!