
సీఎస్కే మాజీ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి చెన్నై ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఐపీఎల్ లో గత రెండు సీజన్లుగా ఆర్సీబీకి సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడు మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ (టీఎస్కే) తరఫున ఆడనున్నాడు. అంతేకాదు ఆ జట్టుకు అతడే సారథిగా వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని టీఎస్కే తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఫాఫ్ డుప్లెసిస్ ఫోటో ను కౌబాయ్ గెటప్ లో చూపిస్తూ ‘యెల్లో అగెయిన్ ఫాఫ్’ అని అందులో రాసుకొచ్చింది.
కాగా 2011 నుంచి 2021 (మధ్యలో చెన్నై బ్యాన్ అయినప్పుడు రాజస్తాన్ రాయల్స్ కు ఆడాడు) మధ్యలో ఫాఫ్ డుప్లెసిస్ సీఎస్కేకు ఆడాడు. సీఎస్కేకు సుమారు వంద కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన డుప్లెసిస్ 2,935 పరుగులు చేశాడు. సీఎస్కేతో ఆడకున్నా అతడు ఇప్పటికీ ఆ జట్టుతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఎ 20 లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జోహన్నస్బర్గ్ సూపర్ కింగ్స్ కు కూడా డుప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ‘యెల్లో’ జెర్సీతో తన అనుబంధాన్ని కొనసాగించనుండటం గమనార్హం.
టెక్సాస్ సూపర్ కింగ్స్ లో ఇదివరకే ఐపీఎల్ లో సీఎస్కేకు ఆడే పలువురు ఆటగాళ్లు ఆ జట్టు తరఫున ఆడుతుండటం తెలిసిందే. అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వేలతో పాటు డేవిడ్ మిల్లర్ కూడా ఈ జట్టు తరఫునే ఆడనున్నాడు. ఇప్పుడు వీరికి డుప్లెసిస్ కూడా జతకలిశాడు.
ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 లో డుప్లెసిస్.. ఆర్సీబీ తరఫున సూపర్ డూపర్ ఫామ్ తో రెచ్చిపోయాడు. 14 మ్యాచ్ లలో ఏకంగా 730 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ తర్వాత టాప్ - 2 లో నిలిచాడు. కాగా ఎంఎల్సీ ఫస్ట్ సీజన్ జులై 13 నుంచి అదే నెల 30 వరకు అమెరికాలోని నార్త్ టెక్సాస్ లో జరుగనున్న విషయం తెలిసిందే.