SA Vs IND: ఓటమి బాధలో కన్నీటి పర్యంతమైన దీపక్ చాహర్.. పది పరుగులు చేయలేదని ఆ ముగ్గురిపై అభిమానుల ఆగ్రహం

Published : Jan 24, 2022, 01:36 PM ISTUpdated : Jan 24, 2022, 01:39 PM IST
SA Vs IND: ఓటమి బాధలో కన్నీటి పర్యంతమైన దీపక్ చాహర్.. పది పరుగులు చేయలేదని ఆ ముగ్గురిపై అభిమానుల ఆగ్రహం

సారాంశం

Deepak Chahar: అసలు ఆశలే లేని స్థిథి నుంచి భారత్ ను పోటీ లోకి తెచ్చి.. చివర్లో విజయానికి కొద్దిదూరంలో దీపక్ చాహర్ నిష్క్రమించాడు. ఆ వెంటనే  భారత జట్టు మిగిలిన వికెట్లను కూడా కోల్పోయి మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో...  

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన  చివరి, మూడో వన్డేలో కూడా భారత  జట్టు దారుణ ఓటమిని మూటగట్టకున్నది. దీంతో వన్డేలలో ఓటమిని పరిపూర్ణం (0-3) చేసింది.  ఆఖరు వన్డేలో  టీమిండియా గెలుపు అంచుల వరకు  వచ్చిందంటే అది ఖచ్చితంగా భారత యువ ఆల్ రౌండర్ దీపక్ చాహర్  పోరాటం వల్లే అని  ఒప్పుకోక తప్పని పరిస్థితి.  అసలు ఆశలే లేని స్థిథి నుంచి భారత్ ను పోటీ లోకి తెచ్చి.. చివర్లో విజయానికి కొద్దిదూరంలో అతడు నిష్క్రమించాడు. ఆ వెంటనే  భారత జట్టు మిగిలిన వికెట్లను కూడా కోల్పోయి మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత  పరాజయం అయిన వెంటనే దీపక్ చాహర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విజయం కోసం అతడు చివరివరకు పోరాడినా అతడి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. 

288 పరుగుల భారీ లక్ష్య  ఛేదనలో భారత జట్టుకు శుభారంభం దక్కకపోయినా కోహ్లి (65), ధావన్ (61) లు ఆదుకోవడంతో రాహుల్ సేన ఒక దశలో మంచి స్థితిలోనే నిలిచింది. కానీ మిడిలార్డర్ లో వచ్చిన వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.  దీంతో భారత్ 223 పరుగులకే 7  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్ చాహర్.. 34 బంతుల్లో 54 పరుగులు చేసి భారత్ ను విజయానికి దగ్గర చేశాడు.  5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి దూకుడుగా కనిపించిన చాహర్.. చివరికి భారత విజయలక్ష్యానికి 10 పరుగుల దూరంలో (278) ఉండగా ఎంగిడి వేసిన 47.1 ఓవర్లో భారీ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. 

 

చాహర్ అవుటైనా బుమ్రా ఉన్నాడులే అన్న ధీమాలో ఉన్న భారత జట్టుకు ఆ తర్వాత ఓవర్లో  పెహ్లుక్వాయో భారీ షాకిచ్చాడు. 48.3 ఓవర్లో అతడు.. బుమ్రాను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో చాహల్  కూడా ప్రిటోరియస్ బౌలింగ్ లో మిల్లర్ కు  క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  చాహల్ నిష్క్రమించగానే డగౌట్ లో కూర్చున్న దీపక్ చాహర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంతో కష్టపడి  భారత్ ను విజయానికి దగ్గర చేసిన అతడు  పడ్డ కష్టమంతా ఆఖర్లో వృథాగా పోయింది.  

 

భారత్ పరాజయం ఖరారుకాగానే చాహర్ కు కన్నీళ్లు ఆగలేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సంబురాలు చేసుకుంటుంటే చాహర్ మాత్రం గుక్కపెట్టి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ స్పందిస్తూ.. భారత లోయరార్డర్ ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఓటమి అంచున ఉన్న భారత జట్టును చాహర్ పోటీలోకి తెచ్చి గెలుపునకు దగ్గరగా తీసుకెళ్తే. చివరికి ముగ్గురు ఆటగాళ్లు (బుమ్రా, చాహల్, కృష్ణ) పది పరుగులు కొట్టలేక  వుత్త చేతులతో పెవిలియన్ కు చేరారని ఫైర్ అవుతున్నారు. 

కాగా ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు టెస్టు సిరీస్ ను 1-2 తేడాతో ఓడిపోగా వన్డే సిరీస్  ను 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. పర్యటనకు ముందు  సిరీస్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన భారత జట్టు.. అనంతరం ఉత్త చేతులతోనే ఇంటి బాట పట్టడం గమనార్హం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!