
India vs England: లీడ్స్ లోని హెడ్డింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్పై 5 వికెట్ల విజయాన్ని అందుకుంది. ఇది టెస్టు చరిత్రలో ఇంగ్లాండ్ రెండవ అతిపెద్ద విజయవంతమైన ఛేజ్. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ సాధించింది.
టార్గెట్ చేధనలో బెన్ డకెట్ (149 పరుగులు) ఆధిపత్య ప్రదర్శన చేశాడు. జాక్ క్రాలీ (65 పరుగులు)తో కలసి తొలి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ప్రసిద్ధ్ కృష్ణ 5వ స్టంప్ లైన్పై నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డకెట్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. క్రాలీ అద్భుత కవర్ డ్రైవ్లతో జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
మధ్యాహ్నం విరామానికి ముందు 100 పరుగుల భాగస్వామ్యం పూర్తవగా, వర్షం కారణంగా మ్యాచ్ కొంత సమయం నిలిచిపోయింది. రెండో సెషన్లో ఇంగ్లాండ్ 152 పరుగులు చేసింది కానీ 4 వికెట్లు కోల్పోయింది. వర్షం తర్వాత భారత్ తిరిగి మ్యాచ్లోకి రావడమే కాకుండా, ప్రసిద్ధ్ కృష్ణ క్రాలీ (65), ఓలీ పోప్ (8)లను ఔట్ చేశాడు.
డకెట్ 94 వద్ద నర్వస్ నైన్టీస్లో పడిపోయాడు.. అయితే, చివరగా సెంచరీని రివర్స్ స్వీప్తో పూర్తి చేశాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన బంతికి డకెట్ 149 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాతి బంతికే హ్యారీ బ్రూక్ (0) ఔట్ అయ్యాడు. దీంతో భారత్కు అవకాశం ఉన్నట్టు అనిపించినా, జో రూట్ (53* పరుగులు), జేమీ స్మిత్ (44*) 71 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ను గెలుపు దిశగా నడిపించారు. బెన్ డకెట్ తన 149 పరుగుల అద్బుతమైన ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్లను రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలు వదిలేసారు. ఆ లైఫ్ ను అందుకుని బెన్ డకెట్ సెంచరీతో ఇంగ్లాండ్ ను గెలిపించాడు.
ఆఖరి సెషన్ ప్రారంభంలో బెన్ స్టోక్స్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. జడేజా బౌలింగ్లో క్యాచ్ అవకాశం వచ్చినా, పంత్, రాహుల్ జాగ్రత్తగా సమన్వయం చేయలేకపోయారు. స్టోక్స్ (33) చివరికి అదే రివర్స్ స్వీప్లో అవుట్ అయ్యాడు. భారత్ చివరి సమీక్షను రూట్ వికెట్ కోసం వృథా చేసింది.
ప్రసిద్ధ్ బౌలింగ్లో రూట్, స్మిత్ అద్భుత షాట్లు ఆడి, స్కోరు వేగవంతం చేశారు. కొత్త బంతిని తీసుకున్న తర్వాత, రూట్ గల్లీలో బౌండరీతో అర్ధశతకం సాధించగా, స్మిత్ జడేజాపై బౌండరీ, రెండు సిక్సులతో మ్యాచ్ను ముగించాడు.
స్కోర్ బోర్డు:
భారత్ 1వ ఇన్నింగ్స్: 471 (శుభ్ మన్ గిల్ 147, పంత్ 134, జైస్వాల్ 101 పరుగులు, బెన్ స్టోక్స్ 4/66 వికెట్లు)
ఇంగ్లాండ్ 1వ ఇన్నింగ్స్: 465 (ఓలీ పోప్ 106, హ్యారీ బ్రూక్ 99 పరుగులు; జస్ప్రీత్ బుమ్రా 5/83 వికెట్లు)
భారత్ 2వ ఇన్నింగ్స్: 364 (రాహుల్ 137, పంత్ 118 పరుగులు)
ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్: 373/5 ( బెన్ డకెట్ 149, క్రాలీ 65 పరుగులు; శార్దూల్ 2/51 వికెట్లు)
ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలుచుకుని ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్లొ 1-0తో ముందంజ వేసింది.
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ హెడింగ్లీలో భారత్తో జరిగిన తొలి టెస్ట్లో చారిత్రాత్మక ప్రదర్శనతో రికార్డులను బద్దలు కొట్టాడు. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డకెట్ అద్భుతమైన 149 పరుగుల ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించాడు. భారత్తో జరిగిన నాల్గవ ఇన్నింగ్స్లలో ఇది ఇంగ్లాండ్ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం.
ముందుగా డకెట్, జాక్ క్రాలే కలిసి తొలి సెషన్లో క్లిష్టమైన పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో సెషన్లో డకెట్ తన సెంచరీని పూర్తి చేశాడు. దీంతో లీడ్స్ వేదికపై నాల్గవ ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన తొలి ఇంగ్లాండ్ ఓపెనర్గా నిలిచాడు. ఆ తర్వాత 149 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో, జో రూట్ గతంలో భారత్పై నమోదుచేసిన 142* పరుగుల రికార్డును డకెట్ అధిగమించాడు.
1. 149 - బెన్ డకెట్, హెడింగ్లీ, 2025
2. 142 - జో రూట్, ఎడ్జ్బాస్టన్, 2022
3. 134 - ఫాఫ్ డుప్లెసిస్, జొహన్నెస్బర్గ్, 2013
4. 124 - దులీప్ మెండిస్, కాండీ, 1985
5. 122*- డారిల్ కుల్లినన్, జొహన్నెస్బర్గ్, 1997
ఇంగ్లాండ్ ఓపెనర్లు డకెట్, క్రాలే 188 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి, భారత్పై నాల్గవ ఇన్నింగ్స్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డును నెలకొల్పారు. 1953లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో అలన్ రే - జెఫ్రీ స్టోల్మేయర్ జోడీ నెలకొల్పిన 142 పరుగుల రికార్డు బద్దలైంది
మొత్తంగా, నాల్గవ ఇన్నింగ్స్లో ఏ జట్టుపైనైనా ఓపెనింగ్ భాగస్వామ్యాల్లో ఇది ఐదవ అత్యధిక భాగస్వామ్యం. ఇప్పటివరకు 1984లో జార్జ్టౌన్లో వెస్టిండీస్ తరఫున గోర్డాన్ గ్రీనిడ్జ్ - డెస్మండ్ హేన్స్ జోడీ నమోదు చేసిన భాగస్వామ్యం టాప్ లో ఉంది.
అంతేకాదు, డకెట్ తన ఆరో టెస్ట్ సెంచరీ నమోదు చేయడంతో పాటు, లీడ్స్ వేదికపై నాల్గవ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండవ ఓపెనర్గా నిలిచాడు. ఇంతకు ముందు, 1948లో ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థర్ మోరిస్ ఇదే వేదికపై ఇంగ్లాండ్పై సెంచరీ నమోదు చేశాడు.