
ఏ రంగంలో రాణించాలన్నా గురువు ఇచ్చే శిక్షణ అత్యంత కీలకం. దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడ కోచింగ్ తీసుకునేందుకు ఎందరో ఔత్సాహికులు కోచ్ ల దగ్గర క్యూ కడుతుంటారు. మన దేశంలో కోచ్ లు ఎందరో ఉన్నప్పటికీ... సర్టిఫైడ్ కోచ్ ల సంఖ్య చాలా తక్కువ. ఈ పరిస్థితికి చరమ గీతం పాడి దేశంలోనే బెస్ట్ కోచ్ లను తాయారు చేసేందుకు బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగింది. క్రికెట్ కోచ్ లుగా మారుదామనుకునే ఆటగాళ్లకోసం ఇది ఎంతో ఉపయుక్తకరంగా ఉండనుంది.
దేశవాళీ క్రికెట్లో నాణ్యమైన, ప్రపంచ స్థాయి కోచ్లను తయారు చేసే బృహత్తర కార్యక్రమానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి శ్రీకారం చుట్టింది. బెంగళూర్లో నూతనంగా నిర్మించనున్న జాతీయ క్రికెట్ అకాడమీలో శాశ్వత ప్రాతిపదికన కోచ్లకు శిక్షణ శిబిరాలు, డిప్లొమా ప్రోగ్రామ్లు సిద్ధం చేస్తున్న బోర్డు.. తొలిసారి లెవల్ 2 కోచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.
అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదా ఫస్ట్క్లాస్లో 75 గేముల అనుభవం కలిగిన క్రికెటర్లు లెవల్ 2 కోచ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకు పూర్వం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి భారత క్రికెటర్లు ఈ సర్టిఫికెట్లు పొందేవారు.
ఇప్పుడు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో బీసీసీఐ స్వయంగా ఈ ప్రోగామ్ను ప్లాన్ చేసింది. నాలుగు రోజులు ఆఫ్లైన్లో క్లాసుల నిర్వహణ సహా నాలుగు రోజులు బెంగళూర్లోని ఎన్సీఏలో శిక్షణ ఇచ్చారు. . 'నైపుణ్య సముపార్జన, అప్లయిడ్ బయోమెకానిక్స్ ఇన్ పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్, వికెట్ కీపింగ్, బిల్డింగ్ సోషల్ అండ్ పర్సనల్ కాంపిటెన్స్, వీడియో విశ్లేషణ' వంటి అంశాల్లో శిక్షణ అందించారు.
మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, రమేశ్ పొవార్, రాబిన్ ఉతప్ప, లక్ష్మిపతి బాలాజీ, సరందీప్ సింగ్, అభినవ్ ముకుంద్ సహా పలువురు క్రికెటర్లు లెవల్ 2 కోచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.