
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోయే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అక్కడ మన ఆటగాళ్లు వేసుకునేబోయే జెర్సీలకు ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్ ను వెతుకనుంది. ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్ అంటే నిన్నా మొన్నటిదాకా (బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ వరకూ) భారత ఆటగాళ్లు వేసుకునే జెర్సీల మీద ‘బైజూస్’ అని కనిపించేది కదా.. అది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తోనే బైజూస్ ఒప్పందం కూడా ముగిసింది.
ఇటీవల ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు జెర్సీల మీద ‘ఇండియా’అని మాత్రమే రాసి ఉంటుంది. అయితే అది ఐసీసీ ఈవెంట్. ఈ టోర్నీలలో ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్ కు చోటు ఉండదు.
కానీ ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం ఫ్రంచ్ జెర్సీ స్పాన్సర్ ఉండాల్సిందే. ఈ మేరకు బీసీసీఐ తాజాగా టెండర్ జారీ చేసింది. ఇండియా వెస్టిండీస్ సిరీస్ నేపథ్యంలో ఈ టెండర్ ను వీలైనంత తొందర్లో ముగించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. అందుకే టెండర్లు పూర్తిచేయడానికి ఆఖరి తేదీని జూన్ 26 గా నిర్ణయించింది. ఆ తర్వాత వేలం ద్వారా కొత్త స్పాన్సర్ ను తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా పేరిట ఓ ప్రకటన విడుదలైంది. టెండర్ ను రూ. 5 లక్షలు చెల్లించి దాఖలు చేయవచ్చు. బీసీసీఐ నిబంధనల మేరకు టెండర్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. బీసీసీఐ కిట్ స్పాన్సర్ గా అడిడాస్ ఇటీవలే ఎంపికైన విషయం తెలిసిందే.
వీటికి నో ఛాన్స్..
గత కొంతకాలంగా ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలను క్రికెట్ స్పాన్సర్షిప్ ల నుంచి తొలగించాలని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ, ఆల్కహాల్ ప్రొడక్ట్స్, రియల్ మనీ గేమింగ్, పొగాకు ఉత్పత్తుల సంస్థలు, పోర్నోగ్రఫీ సంస్థలను ఈ స్పాన్సర్షిప్ కు దూరంగా ఉంచింది. ఇందుకు సంబంధించిన సంస్థలేమీ టెండర్ ను దాఖలు చేసేందుకు వీలులేదని తేల్చి చెప్పింది.