
పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ తన సహచర ఆటగాడు హసన్ అలీపై కోపంతో ఊగిపోయాడు. బ్యాట్ తో అతడిని కొట్టడానికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇది చూసిన హసన్ అలీ.. భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగంగా నిన్న రాత్రి పెషావర్ జల్మీ - ఇస్లామామాబాద్ యూనైటెడ్ తో మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాబర్-హసన్ అలీల మధ్య జరిగిన గొడవ ఉత్తుత్తదే. ఈ మ్యాచ్ లో పెషావర్ జల్మీ బ్యాటింగ్ చేస్తుండగా 14వ ఓవర్లో హసన్ అలీ బౌలింగ్ చేశాడు. అప్పుడు బాబర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. హసన్ వేసిన బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడిన బాబర్ సింగిల్ కోసం పరిగెత్తాడు.
బాబర్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వస్తుండగా క్రీజు మధ్యలోకి వచ్చిన హసన్.. అతడిని ఏదో అన్నాడు. దీంతో బాబర్ బ్యాట్ ను ఎత్తి ‘నీ అంతు చూస్తా’ అన్నంత రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. ఇది చూసిన హసన్.. ‘వామ్మో నేను జంప్’అనుకుంటూ అక్కడ్నుంచి పరుగు అందుకున్నాడు. ఇది చూసి అక్కడున్న క్రికెటర్లతో పాటు అంపైర్ల, కామెంట్రీ చెబుతున్న కామెంటేటర్ల మోముపై నవ్వులు విరబూసాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో హసన్ అలీ.. నాలుగు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చి మూడువికెట్లు తీశాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
కాగా ఈ వీడియోపై పలువురు పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రం మరో విధంగా కామెంట్ చేస్తున్నారు. 2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా - పాకిస్తాన్ ల మధ్య సెమీస్ జరిగింది. సెమీఫైనల్లో ఇరు జట్లకు గెలిచే అవకాశాలున్నా 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ అలీ జారవిడిచాడు. పాకిస్తాన్ కు ఓటమి తప్పలేదు. దీంతో హసన్ అలీపై అప్పట్లో తీవ్ర ట్రోలింగ్ నడిచింది. క్రమంగా అతడు పాక్ టీమ్ లో కూడా చోటు కోల్పోయాడు. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకుని అప్పుడు హసన్ అలీని వెనుకేసుకొచ్చిన బాబర్ ఇప్పుడు కోపంతో ఊగిపోయాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక పెషావర్ జల్మీ - ఇస్లామాబాద్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (75) రాణించాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఇస్లామాబాద్.. 14.5 ఓవర్లలోనే ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (31 బంతుల్లో 62, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ కు తోడు రస్సీ వన్ డర్ డసెన్ (29 బంతుల్లో 42, 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. దీంతో మరో ఐదు ఓవర్లు మిగిలుండానే ఇస్లామాబాద్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్.. మూడు మ్యాచ్ లలో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ముల్తాన్ సుల్తాన్స్ తొలి స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ లు ఆడిన పెషావర్.. రెండు మ్యాచ్ లలో గెలిచి రెండింట్లోఓడి నాలుగో స్థానంలో ఉంది.