"కంగారె"త్తిన ఇండియా: చేజేతులా వికెట్లు పారేసుకున్న రోహిత్, రాహుల్

By telugu teamFirst Published Jan 14, 2020, 5:15 PM IST
Highlights

ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో బారత బ్యాట్స్ మెన్ కంగారెత్తారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చేజేతులా వికెట్లను పారేసుకున్నారు. శిఖర్ ధావన్, రాహుల్ తప్ప అందరూ తోక ముడిచారు.

ముంబై: వాంఖడే స్టేడియంలో మంగళవారం ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో భారత బ్యాట్స్ మెన్ కంగారెత్తినట్లే కనిపించారు. ఓపెనర్ రోహిత్ శర్మ సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెఎల్ రాహుల్ కూడా చేజేతులా వికెట్ పారేసుకున్నాడు. 

అగర్ వేసిన 28వ ఓవరు తొలి బంతిని కవర్స్ మీదుగా తేలికపాటి షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ గాలిలో లేచిన బంతిని క్యాచ్ పట్టాడు. దాంతో రాహుల్ అర్థ సెంచరీ మిస్సయ్యాడు. అంతకు ముందు రోహిత్ శర్మ కూడా ఇదే పద్ధతిలో అవుటయ్యాడు.

Also Read: ముంబై వన్డే: ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.

స్టువర్ట్ వేసిన ఐదో ఓవరు మూడో బంతిని మిడాఫ్ మీదుగా ఆడడానికి రోహిత్ శర్మ ప్రయత్నించాడు. అయితే, బంతి డేవిడ్ వార్నర్ చేతిలోకి క్యాచ్ గా వెళ్లింది. రోహిత్ అవుటైన తర్వాత శిఖర్ ధావన్ కు రాహుల్ జత కలిశాడు. వారిద్దరు ఇన్నింగ్సును సరిదిద్దే ప్రయత్నం చేశారు. 

రాహుల్, శిఖర్ ధావన్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత రాహుల్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థ సెంచరీ చేశాడు. ధావన్ 66 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ సెంచరీ చేశాడు. ధావన్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు.

దాంతో ఆరు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. కంగారుల ధాటికి ఆ తర్వాత భారత బ్యాట్స్ మెన్ ఎవరు కూడా పెద్దగా పరుగులు సాధించలేకపోయారు.

click me!