T20 Worldcup: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.
ఐదు వన్డే ప్రపంచకప్ లు గెలిచినా ఇంతవరకు టీ20 వరల్డ్ కప్ (T20 World cup) నెగ్గని ఆస్ట్రేలియా (Australia)కు ఐసీసీ మెగా ఈవెంట్ కు ముందు భారీ షాక్ తగిలింది. ఈసారి టీ20 ప్రపంచకప్ ను ఎలాగైనా నెగ్గి.. అనంతరం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series) ను దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ. ఆసీస్ స్టార్ బౌలర్.. టెస్టుల్లో ఆ జట్టు తరఫున ప్రత్యర్థులకు చుక్కలు చూపించే పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ (James Pattinson) టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
ఆసీస్-ఇంగ్లండ్ టీమ్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే యాషెస్ సిరీస్ కు ముందు ప్యాటిన్సన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆస్ట్రేలియా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అతడు తరుచూ గాయాల భారీన పడుతుండటమే ముఖ్య కారణమని తెలుస్తున్నది.
ఇది కూడా చదవండి: Virat Kohli: భార్య, కూతురుతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కోహ్లి.. దుబాయ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కెప్టెన్
కొద్దిరోజులుగా ప్యాటిన్సన్.. మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో ఇక తాను కొనసాగలేనని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని అన్నాడు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కు కూడాచెప్పినట్టు సమాచారం. ‘వయసు మద పడుతున్న కొద్దీ ఇంకా క్రికెట్ ను ఆస్వాదించాలనుకోవడం అనేది జీవితంలో చాలా కష్టమైన విషయం’ అని ప్యాటిన్సన్ అన్నాడు.
2019 లో ఇంగ్లండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ ను ఆసీస్ చేజిక్కించుకోవడం వెనుక ప్యాటిన్సన్ కృషి ఎంతో ఉంది. టెస్టు కెరీర్ లో 21 మ్యాచ్ లు ఆడిన ప్యాటిన్సన్.. 81 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆసీస్ జట్టులో మిచెల్ స్టార్క్, హెజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ లు అద్భుతమైన ప్రదర్శనతో మెరుస్తుండటంతో ప్యాటిన్సన్ కనుమరుగైపోయాడు.