
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మిగిలిన టీమ్ లు కెప్టెన్ల పేర్లను ఇదివరకే ప్రకటించాయి. లీగ్ ప్రారంభానికి మరో రెండ్రోజులు మాత్రమే టైమ్ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సారథిని అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి మెగ్ లానింగ్.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించనుంది. ఈ మేరకు ఢిల్లీ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ ప్రకటన చేసింది.
ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో సౌతాఫ్రికాను ఓడించి వరుసగా మూడో ట్రోఫీ (మొత్తంగా నాలుగో టీ20 ట్రోఫీ, 2022లో వన్డే వరల్డ్ కప్ కూడా ఆమె సారథ్యంలోనే ఆసీస్ గెలిచింది. మొత్తంగా ఐదు ఐసీసీ ట్రోఫీలు) గెలిచిన లానింగ్.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో ఢిల్లీని నడిపించనుంది.
30 ఏండ్ల లానింగ్ ఇప్పటివరకు 132 టీ20 మ్యాచ్ లు ఆడింది. ఈ క్రమంలో ఆమె 3,405 పరుగులు కూడా సాధించింది. ఇందులో రెండు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. అంతేగాక వందకు పైగా టీ20లలో ఆస్ట్రేలియా జట్టుకు సారథిగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టుకు ఇన్ని మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉన్న ప్లేయర్ మరొకరు లేరు. ఆమె అనుభవం, ఆట ఢిల్లీకి లాభం చేకూరుస్తుందని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నది.
కాగా లానింగ్ ను సారథిగా నియమించిన ఆ జట్టు టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. వాస్తవానికి ఢిల్లీ కెప్టెన్ గా షఫాలీ పేరు కూడా రేసులో ఉంది. ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ లో షఫాలీ భారత జట్టును విజయవంతంగా నడిపించడంతో ఆమెకు ఢిల్లీ కెప్టెన్ గా లేదంటే వైస్ కెప్టెన్ గా అయినా ఎంపిక చేస్తారని అంతా భావించినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఆమెకు షాకిచ్చింది. ఇక ఈ టోర్నీలో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ను మార్చి 5న స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.
మూడో ఆసీస్ ప్లేయర్..
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లోనే ఆస్ట్రేలియా ఆటగాళ్ల డామినేషన్ కొనసాగనుంది. ఐదు జట్లు బరిలోకి దిగబోయే ఈ టోర్నీలో మూడు టీమ్ లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లే సారథ్యం వహిస్తున్నారు. గుజరాత్ జెయింట్స్ కు బెత్ మూనీ, యూపీ వారియర్స్ కు అలీస్సా హీలి సారథులుగా ఉండగా తాజాగా లానింగ్ కూడా ఆసీస్ ప్లేయరే కావడం గమనార్హం. భారత జట్టుకు చెందిన పలువురు ప్లేయర్లు గుజరాత్, యూపీ, ఢిల్లీకి వైస్ కెప్టెన్సీలకే పరిమితమయ్యారు. కాగా ముంబైకి హర్మన్ప్రీత్ కౌర్, ఆర్సీబీకి స్మృతి మంధానలు భారత్ కు చెందినవారే.
డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా : జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్, అపర్ణా మండల్, స్నేహ్ దీప్తి, పూనమ్ యాదవ్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుందతి రెడ్డి