బ్రాడ్‌మన్, సచిన్.. ఆగస్టు 14: ఇద్దరు దిగ్గజాలకు ఈ రోజుతో లింకేంటీ..!!!

By Siva KodatiFirst Published Aug 14, 2019, 1:48 PM IST
Highlights

క్రికెట్ చరిత్రలో ఆల్‌టైం గ్రేట్‌లుగా కీర్తించబడే సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్‌లకు ఆగస్టు 14తో విడదీయరాని సంబంధం ఉంది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌ను ఈ రోజునే ముగించగా.. సచిన్ టెస్టుల్లో తన తొలి సెంచరీని ఇదే రోజున సాధించాడు

క్రికెట్ చరిత్రలో ఆల్‌టైం గ్రేట్‌లుగా కీర్తించబడే సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్‌లకు ఆగస్టు 14తో విడదీయరాని సంబంధం ఉంది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌ను ఈ రోజునే ముగించగా.. సచిన్ టెస్టుల్లో తన తొలి సెంచరీని ఇదే రోజున సాధించాడు.

1948లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ల మధ్య యాషెస్ సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌తో తాను క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు డాన్ ప్రకటించారు. దీంతో చివరి మ్యాచ్‌ కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 52 పరుగులకే కుప్పకూలింది. ఆగస్టు 14న వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రాడ్‌మన్‌ తొలి బంతిని డిఫెన్స్ ఆడారు.

రెండో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఆయన క్లీన్ బౌల్డవ్వడంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డాన్ ప్రస్థానం ముగిసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు వారి క్యాప్‌లను తీసి బ్రాడ్‌మన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఇతర ఆటగాళ్లు రాణించడంతో ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.

ఇక ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ 1990 ఆగస్టులో భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన సచిన్.. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఆగస్టు 14వ తేదీన 119 పరుగులు చేసి టెస్టుల్లో తొలి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. టెండూల్కర్ పోరాటం కారణంగా భారత్ ఈ టెస్టును డ్రాగా ముగించింది. 

click me!