
అహ్మదాబాద్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు ముందు ఇరు దేశాల ప్రధానులు స్టేడియానికి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ లు జాతీయ గీతాలాపనతో పాటు ఆటగాళ్లకు కరచాలనం చేసి కొంతసేపు మ్యాచ్ ను వీక్షించారు. రెండు దేశాల మధ్య సిరీస్ మొదలై 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా ఇరు ప్రధానులకు బీసీసీఐ జ్ఞాపికలను అందజేసింది. ఆసీస్ ప్రధానికి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ జ్ఞాపికను అందజేయగా నరేంద్ర మోడీకి బీసీసీఐ సెక్రటరీ జై షా.. మోడీ ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చాడు.
అయితే మోడీకి షా గిఫ్ట్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలలో ‘నరేంద్ర మోడీ ఫ్రెండ్ (అమిత్ షా) కొడుకు మోడీ ఫోటోను నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ స్టేడియంలో అందజేస్తున్నాడు..’అని రాసుకొచ్చింది.
కాంగ్రెస్ చేసిన ఈ ట్వీట్ కు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆటలో కూడా రాజకీయాలు చూసే అలవాటు కాంగ్రెస్ కు ఉందని, అక్కడ జై షా జ్ఞాపికను అందజేసింది అమిత్ షా కొడుకుగా కాదని.. బీసీసీఐ సెక్రటరీగా అందజేశారని క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ ట్వీట్ పై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి.
హస్తం పార్టీ చేసిన ఈ కామెంట్ ను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ‘అర్థరహితమైనవి’గా అభివర్ణించాయి. రెండు దేశాల మధ్య సిరీస్ మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గత 75 ఏండ్లలో ఇరు దేశాల తరఫున ఆటగాళ్ల కొలేజ్ తో కూడిన ప్రత్యేక ఫోటోను ప్రధానికి బహుమతిగా ఇవ్వడం ఒక ప్రత్యేకమైన సంజ్ఞ అని తెలిపింది.
కాగా మ్యాచ్ విషయానికొస్తే.. అహ్మదాబాద్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180) తో పాటు కామెరూన్ గ్రీన్ (114) లు సెంచరీలతో మెరిశారు. చివరి వరుస బ్యాటర్లు అయిన నాథన్ లియాన్ (34), టాడ్ మర్ఫీ (41) కూడా భారత బౌలర్లకు విసుగు తెప్పించే విధంగా ఆడారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించి 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలుపోటములను రేపటి రోజు నిర్దేశించనుంది. ఆసీస్ మాదిరిగానే భారత్ కూడా నిలకడగా ఆడితే ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించొచ్చు. లేకుంటే మరో ఇండోర్ ఫలితం మన ముందు ఉండొచ్చు.