
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. సుమారు దశాబ్దంన్నర నుంచి భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసుకుని ఆటగాడిగా, నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఉన్న కోహ్లీ.. తాజాగా తన జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన విషయాలను వెల్లడించాడు. అదే తన లైఫ్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ కోసం సిద్ధమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విడుదల చేసిన పోడ్కాస్ట్ లో కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు.
తన నాన్న చనిపోయిన రోజు గానీ అండర్ - 19 క్రికెట్ కెప్టెన్ గా వరల్డ్ కప్ గెలిచినప్పుడు గానీ, భారత సీనియర్ జట్టుకు సారథిగా ఎంపికైనప్పుడు గానీ కోహ్లీ తన లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ అవుతుందని అందరూ అనుకున్నా కోహ్లీ మాత్రం తన జీవితంలో అనుష్కను కలవడమే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ‘మా నాన్న చనిపోయినప్పుడు నా దృక్పథం మారిపోయింది. కానీ నా చుట్టూ ఉన్న జీవితం మాత్రం ఎప్పటిలాగే ఉంది. నాన్న చనిపోయాక నేను జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానోదానిపై పూర్తి స్పష్టత వచ్చింది. నా కలను సాకారం చేసుకోవడానికి నేనేం చేయాలో పూర్తి అవగాహన వచ్చింది. కానీ అది నా జీవితాన్ని మార్చిన ఘటన అయితే కాదు. నేను గతంలో మాదిరిగానే క్రికెట్ ఆడుతున్నాను. నా చుట్టూ వాతావరణం కూడా సాధారణంగానే ఉంది...
కానీ నేను అనుష్కను కలవడం నా జీవితంలో లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ అని చెప్పగలను. ఎందుకంటే అనుష్కను కలిశాక నేను నా లైఫ్ ను చాలా భిన్నంగా చూశాను. నా గత జీవితానికి దీనికి సంబంధమే ఉండకుండా ఉండే లైఫ్ అది. ఎందుకంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీలో కలిగే మార్పులను మీరు ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తారు. అందుకు అనుగుణంగా మీరు కదలాలి. ప్రేమలో ఉంటే చాలా విషయాలు అంగీకరించాలి. అందుకే అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది...’అని కోహ్లీ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత కోహ్లీ - అనుష్క లు 2017లొ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 జనవరిలో ఈ దంపతులకు వామిక పుట్టింది. ప్రస్తుతం కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడుతున్నాడు. అనుష్క తన బాలీవుడ్ సినిమాల పనిలో బిజీగా ఉంది.